లోక్‌సభ సీట్లలోనూ విజయదుందుభి

రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అప్రతిహత విజయం సాధించింది. 21 స్థానాల్లో గెలుపొందింది. పొత్తులో భాగంగా తెదేపా 17చోట్ల పోటీచేసింది.

Published : 05 Jun 2024 05:03 IST

21 స్థానాల్లో కూటమి హవా
తెదేపాకు 16 స్థానాలు
పోటీచేసిన రెండు స్థానాల్లోనూ జనసేన గెలుపు
భాజపా ఆరింటిలో మూడింట విజయం
వైకాపా నాలుగుకే పరిమితం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అప్రతిహత విజయం సాధించింది. 21 స్థానాల్లో గెలుపొందింది. పొత్తులో భాగంగా తెదేపా 17చోట్ల పోటీచేసింది. ఒక్క కడప లోక్‌సభ స్థానం మినహా మిగిలిన అన్నిచోట్లా జెండా ఎగురవేసింది. కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీచేసి, రెండింటిలోనూ గెలిచింది. మరోవైపు పొత్తులో భాగంగా భాజపా ఆరు స్థానాల్లో పోటీచేసి.. అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాలను గెలుచుకుంది. అరకులోయ, తిరుపతి, రాజంపేట స్థానాలను కోల్పోయింది. వైకాపా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైకాపా... లోక్‌సభ సీట్ల విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లయింది. శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్‌సభ అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో నాలుగు లోక్‌సభ స్థానాలను వైకాపా సాధించుకోగలిగింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైకాపా.. ప్రస్తుతం నాలుగింటికే పరిమితం కావాల్సి వచ్చింది. అదే సమయంలో తెదేపా బలం బాగా పుంజుకుంది. అప్పట్లో మూడు స్థానాలే గెలుచుకున్న తెదేపా ప్రస్తుతం 16 స్థానాలు పొందింది. పొత్తులనూ కలిపితే.. తెదేపా కూటమికి 21 స్థానాలు వచ్చాయి.

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి గెలుపొందారు. ఇంతకుముందు రాజ్యసభ సభ్యునిగా ఉండి అనకాపల్లి నుంచి పోటీచేసిన సీఎం రమేష్‌ గెలిచారు. శ్రీకాకుళం నుంచి కె.రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్‌ మాథుర్‌ అమలాపురం నుంచే గెలిచారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గెలుపుబాటలో ఉన్నారు. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. ఈ ముగ్గురూ 2019లో వైకాపా నుంచి గెలిచి, ఇప్పుడు తెదేపాలో చేరి అక్కడా గెలిచారు. రాజంపేట నుంచి వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓడించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి నెల్లూరు నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. 

వైకాపా ఎమ్మెల్యేలుగా ఉండి ఈ ఎన్నికల్లో లోక్‌సభ బరిలోకి వచ్చిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నరసరావుపేట) చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఒంగోలు) మాలగుండ్ల శంకరనారాయణ (అనంతపురం), కిలారి వెంకటరోశయ్య (గుంటూరు) ఓటమి పాలయ్యారు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైకాపా చెంత చేరిన రాపాక వరప్రసాద్‌ అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కడప నుంచి బరిలో నిలిచిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ నుంచి కడప ఎంపీగా అవినాష్‌రెడ్డి మూడోసారి ఎంపీగా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని