చట్టసభలకు బ్యూరోక్రాట్లు!

రాష్ట్ర శాసనసభలోకి ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు, లోక్‌సభలోకి ఓ విశ్రాంత ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురూ ఎన్డీయే తరఫున పోటీచేసి గెలుపొందారు.

Published : 05 Jun 2024 05:21 IST

లోక్‌సభకు ఒక మాజీ ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌
శాసనసభకు ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు

ఈనాడు-అమరావతి: రాష్ట్ర శాసనసభలోకి ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు, లోక్‌సభలోకి ఓ విశ్రాంత ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురూ ఎన్డీయే తరఫున పోటీచేసి గెలుపొందారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం(ఎస్సీ) నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన తెన్నేటి కృష్ణప్రసాద్‌ విజయం సాధించారు. ఈయన తల్లిదండ్రుల స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు. తెలంగాణ పోలీసుశాఖలో డీజీపీ హోదాలో 2022లో పదవీ విరమణ చేసిన తెన్నేటి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం(ఎస్సీ) నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్‌ గెలుపొందారు. 

రాజోలు నుంచి శాసనసభలోకి..

డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం(ఎస్సీ) నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవ వరప్రసాద్‌ విజయం సాధించారు. మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన ఈయన ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మరో మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పల్నాడు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం(ఎస్సీ) నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.   

ఇంతియాజ్‌ పరాజయం

  • కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన ఇంతియాజ్‌ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఈయన ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
  • బాపట్ల లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన జేడీ శీలం మరోసారి ఓటమి చవిచూశారు. ఈయన గతంలో కర్ణాటక క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా పనిచేశారు. 
  • మాజీ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 
  • జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని