కాంగ్రెస్‌ బరిలో లేని ఇందౌర్‌లో నోటాకు 2,18,674 ఓట్ల రికార్డు

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 2,18,674 మంది ఓటర్లు ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది అబౌ) మీట నొక్కారు.

Published : 05 Jun 2024 05:40 IST

భోపాల్, దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 2,18,674 మంది ఓటర్లు ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది అబౌ) మీట నొక్కారు. ఈ నియోజకవర్గంలో అనివార్యంగా బరిలో నుంచి వైదొలగాల్సి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నోటాకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ స్థానంలో నోటాకు గరిష్ఠంగా 51,660 ఓట్లు నమోదయ్యాయి. గోపాల్‌గంజ్‌ రికార్డును ఇపుడు ఇందౌర్‌ అధిగమించింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్నికల సంఘం వెబ్‌సైటులో నమోదైన తాజా గణాంకాల ప్రకారం ఇందౌర్‌లో నోటాకు వచ్చిన 2,18,674 ఓట్లు (16.28%) ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఇందౌర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ టికెటు పొందిన అక్షయ్‌ కాంతి బమ్‌ చివరిదశలో తన నామినేషను ఉపసంహరించుకొని భాజపాలో చేరడంతో ఇక్కడ హస్తం గుర్తు తరఫున అభ్యర్థి లేకుండా పోయారు. 72 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇందౌర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో లేకుండాపోవడం ఇదే మొదటిసారి. దీంతో భాజపాకు గుణపాఠం నేర్పేందుకు నోటా మీట నొక్కాల్సిందిగా ఓటర్లకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని