జైలు నుంచే ఎంపీగా గెలుపు.. లోక్‌సభకు వెళ్లొచ్చా?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో 18వ లోక్‌సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైంది. వీరిలో రాజకీయ ఉద్ధండులు, తొలిసారి ఎన్నికైన వారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులున్నారు.

Published : 06 Jun 2024 07:49 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో 18వ లోక్‌సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైంది. వీరిలో రాజకీయ ఉద్ధండులు, తొలిసారి ఎన్నికైన వారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులున్నారు. వీరందరిని పక్కనబెడితే కొత్తగా ఎన్నికైన వారిలో ఇద్దరి గెలుపు ఆశ్చర్యపరిచింది. అవును.. వాళ్లు జైలు నుంచే ఈ ఎన్నికల్లో పోటీ చేయడమేగాక.. విజయాన్ని సొంతం చేసుకున్నారు. వారే అమృత్‌పాల్‌ సింగ్, ఇంజినీరు రషీద్‌. మరి వారు లోక్‌సభకు వెళ్లొచ్చా.. నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం..

పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌ పాల్‌ సింగ్, జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజినీరు రషీద్‌ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి తెలిపారు.

‘ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత అవశ్యం. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ సభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంటుకు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలి’ అని ఆచారి వెల్లడించారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరు కాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థనలను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్‌ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని