కోల్పోయింది 26.. నిలబెట్టుకొన్నది 42

లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను భాజపా గణనీయంగా కోల్పోయింది.

Published : 08 Jun 2024 06:29 IST

రిజర్వుడు లోక్‌సభ స్థానాల్లో భాజపా పనితీరు ఇదీ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను భాజపా గణనీయంగా కోల్పోయింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న ఈ సీట్లలో 26ను కాంగ్రెస్, దాని నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాలు ఈ దఫా సొంతం చేసుకున్నాయి. మరో 42 రిజర్వుడు స్థానాలను భాజపా, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలైన జేడీ(యు), లోక్‌జనశక్తి పార్టీ(రాంవిలాస్‌) నిలబెట్టుకున్నాయి. రిజర్వుడు స్థానాల్లో ఓటమి చవిచూసిన కమలం పార్టీ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, కౌశల్‌ కిశోర్, నిసిత్‌ ప్రమాణిక్, భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఉన్నారు. గెలిచిన ఎన్డీయే అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (బీకనేర్‌), చిరాగ్‌ పాసవాన్‌ (హాజీపుర్‌), బిహార్‌ మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝీ(గయ) తదితరులు ఉన్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఒక స్థానం(సూరత్‌) ఏకగ్రీవం కావడంతో 542 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రిజర్వుడు స్థానాలు 131 కాగా...ఎస్సీలకు84, ఎస్టీలకు47 స్థానాలను కేటాయించారు.

పెరిగిన ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల పోలింగ్‌

2024 లోక్‌సభ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల పోలింగ్‌ శాతం గత సార్వత్రిక ఎన్నికల కన్నా పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్‌ కాగా తాజా ఎన్నికల్లో ఇది 25శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,87,803 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని