Rammohan Naidu: కేంద్ర క్యాబినెట్‌లోకి రామ్మోహన్‌నాయుడు

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెదేపా ఎంపీలకు స్థానం ఖరారయింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు.

Updated : 09 Jun 2024 13:45 IST

ఉత్తరాంధ్రకు మరోసారి కీలక ప్రాధాన్యం
సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని
నేడు ప్రధాని మోదీతో పాటు  ప్రమాణస్వీకారం
విస్తరణలో తెదేపాకు మరో 2 మంత్రి పదవులొచ్చే అవకాశం

కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌

ఈనాడు, అమరావతి: కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెదేపా ఎంపీలకు స్థానం ఖరారయింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన తెదేపా.. ఎన్డీయే కూటమిలో భాజపా తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెదేపాకు మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

అనుభవం, నేపథ్యం కలిసివచ్చి..

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర క్యాబినెట్‌ బెర్తు ఖరారు చేశారు.

ఉత్తరాంధ్రకు మరోసారి వరమాల

సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా తెదేపాకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిచ్చి చంద్రబాబు.. ఈ ప్రాంతం తమకెంత కీలకమో చాటిచెబుతున్నారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో తెదేపా చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. 2014లో ఎన్డీయే సర్కారులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు రామ్మోహన్‌నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై తెదేపాకున్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది.

పెమ్మసానికి తొలిసారే అదృష్టం

ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి తెదేపా ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణిస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్‌ ఎంపికలో తొలుత 10 స్థానాల కంటే ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో తెదేపాకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని తెదేపా వర్గాలు చెబుతున్నాయి.


కింజరాపు రామ్మోహన్‌నాయుడు

స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
వయసు: 36 సంవత్సరాలు
విద్యార్హత: బీటెక్, ఎంబీఏ 
తల్లిదండ్రులు: విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు 
భార్య: శ్రావ్య, కుమార్తె: నిహిరఅన్వి శివాంకృతి

రాజకీయ నేపథ్యం: తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఓటమిపాలయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

న్యూస్‌టుడే, టెక్కలి


పెమ్మసాని చంద్రశేఖర్‌ 

జన్మస్థలం: బుర్రిపాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
వయసు: 47
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఇంటర్నల్‌ మెడిసిన్‌)
తల్లిదండ్రులు: సువర్చల, పెమ్మసాని సాంబశివరావు
భార్య: డాక్టర్‌ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె 

చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి తెదేపాతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. 

న్యూస్‌టుడే, గుంటూరు (పట్టాభిపురం)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని