పార్లమెంటులో మీ గళమవుతా.. విద్యార్థులకు రాహుల్‌ హామీ

నీట్‌-యూజీ వైద్య ప్రవేశ పరీక్ష వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీపై  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు కురిపించారు.

Published : 10 Jun 2024 05:22 IST

దిల్లీ: నీట్‌-యూజీ వైద్య ప్రవేశ పరీక్ష వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీపై  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు కురిపించారు. పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలు 24 లక్షల మంది భవిష్యత్తును అయోమయంలో పడేశాయన్నారు. దేశంలోని విద్యార్థుల తరఫున భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతానని ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణం చేయకముందే 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలను నీట్‌లో జరిగిన అక్రమాలు నాశనం చేశాయని ఆరోపించారు. ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు దక్కినా, సాంకేతికంగా సాధ్యంకాని విధంగా కొందరికి ఒకే తరహా మార్కులు వచ్చినా ప్రశ్నపత్రం లీకవడానికి గల అవకాశాలను కేంద్రం తోసిపుచ్చుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కై విద్యా మాఫియా సాగిస్తున్న పరీక్ష పత్రాల లీకుల పరిశ్రమను నిలువరించేందుకు కాంగ్రెస్‌ వద్ధ పటిష్ఠమైన ప్రణాళిక ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. చట్టం తీసుకురావడం ద్వారా విద్యార్థులను పరీక్ష పత్రాల లీకుల నుంచి రక్షిస్తామంటూ తమ ఎన్నికల ప్రణాళికలో కూడా హామీ ఇచ్చామని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని