నేడు రాజస్థాన్‌కు చేరనున్న రాహుల్‌ యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో’ పాదయాత్ర ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌కు చేరుకోనుంది.

Published : 04 Dec 2022 05:12 IST

జైపుర్‌, భోపాల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో’ పాదయాత్ర ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌కు చేరుకోనుంది. 17 రోజులపాటు ఆ రాష్ట్రంలో కొనసాగనుంది. గత 11 రోజులుగా మధ్యప్రదేశ్‌లో ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు. సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన పాదయాత్ర ఇప్పటికి 87 రోజులు పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌లోకి రాహుల్‌ను స్వాగతిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ వీడియో సందేశం విడుదల చేశారు. మరోవైపు- వివాదాస్పద ‘కంప్యూటర్‌ బాబా’ నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి శనివారం రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొనడాన్ని భాజపా తప్పుపట్టింది. గత నెల 24న ఈ యాత్రలో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడొకరిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

పార్లమెంట్‌ సమావేశాలకు రాహుల్‌ దూరం

ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ వంటి సీనియర్‌ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకావట్లేదని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జోడో యాత్రకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని