MLC Election: ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలోని ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

Published : 27 May 2024 16:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భారాస అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్‌ ప్రధానంగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఈవీఎంలను వినియోగించే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్‌ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్‌ చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెట్టినందువల్ల ఈ ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలుకి వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసే అవకాశం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. సాయంత్రం 4 గంటల వరకు వరుసలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. జూన్‌ 5న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని