Lok sabha Elections: సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌

Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు.

Updated : 19 Apr 2024 07:31 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమరం అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 

35.67 లక్షల మంది తొలిసారి..

దేశవ్యాప్తంగా ఈరోజు 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 35.67 లక్షల మంది తొలిసారి ఓటర్లు. 20-29 ఏళ్ల మధ్య వయసువారు 3.51 కోట్లు ఉన్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది.

బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

భాజపా నుంచి నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌), కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ పశ్చిమం), అన్నామలై (కోయంబత్తూర్‌), తమిళిసై సౌందరరాజన్‌ (చెన్నై దక్షిణం) సర్వానంద సోనోవాల్‌ (డిబ్రూగఢ్‌), భూపేంద్రయాదవ్‌ (అల్వర్‌), జితిన్‌ ప్రసాద (పీలీభీత్‌) బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో గౌరవ్‌ గొగొయ్‌ (జోర్హాట్‌), నకుల్‌నాథ్‌ (ఛింద్వాడా), కార్తీ చిదంబరం (శివగంగ)తో పాటు డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

రెండు రాష్ట్రాల్లో శాసనసభలకూ..

అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. అరుణాచల్‌లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను భాజపా ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మిగిలినవాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో ఐదు, రాజస్థాన్‌లో 12, మధ్యప్రదేశ్‌లో ఆరు, త్రిపుర ఒకటి, అరుణాచల్‌ప్రదేశ్‌ రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌ ఎనిమిది, మిజోరం ఒకటి, సిక్కిం ఒకటి, తమిళనాడు 39, అండమాన్‌ నికోబార్‌ ఒకటి, అస్సాం ఐదు, నాగాలాండ్‌ ఒకటి, బిహార్‌ నాలుగు, మహారాష్ట్ర ఐదు, మేఘాలయ రెండు, మణిపూర్‌ రెండు, పశ్చిమ బెంగాల్‌లో మూడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని