Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్‌, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్‌

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇలా చేస్తే మొత్తం పార్లమెంట్‌, అసెంబ్లీలు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.

Updated : 26 Mar 2023 22:26 IST

శ్రీనగర్: కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం సరైన చర్య కాదని ఆ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) ఛైర్మన్ గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు.

‘ప్రజాప్రతినిధులపై తక్షణమే అనర్హతకు నేను వ్యతిరేకం. అది రాహుల్ గాంధీ కానివ్వండి.. లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి.. లేదా మరే ఇతర ఎంపీ, ఎమ్మెల్యే అయినా సరే. ఒకవైపు కోర్టు తీర్పు వెలువరించడం.. వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించడం.. ఇదంతా సహజ న్యాయానికి విరుద్ధం. ఇది సరైన చర్య కాదు’ అని ఆజాద్ అభిప్రాయపడ్డారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘గతంలో చివరి న్యాయస్థానం శిక్ష విధించనంత వరకు ఒకరిని అనర్హుడిగా ప్రకటించకూడదనే నిబంధన ఉంది. చివరి కోర్టును చేరుకునే మధ్యలో 20 అంచెలు ఉన్నాయి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడు రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఇలా చేస్తే మొత్తం పార్లమెంట్‌, అసెంబ్లీలు ఖాళీ అవుతాయి. ఈ విషయంలో రాజకీయ నేతలకు ప్రత్యేక ప్రమాణాలు ఉండాలి’ అని ఆజాద్‌ అన్నారు.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తదనంతరం ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ను చేపట్టింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగగా.. మరోవైపు, దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు