CPI Narayana: జగన్‌కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు: సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. 

Updated : 04 Oct 2023 16:39 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తారన్న విషయాన్ని మోదీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు.  మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మోదీని ఎలా నమ్మలేదో.. కేసీఆర్‌ను కూడా అలానే అనుమానించాల్సి ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లు ఉందన్నారు.

‘‘మోదీ చెప్పాల్సిన అసలు రహస్యం ఏపీలో విలువైన ఇసుక బీచ్‌లు అదానీకి అప్పగించిన విషయం. లిక్కర్ స్కాంలో ఉన్న భారాస, వైకాపా.. భాజపాతో కలిసిపోయాయి. మిగతా వాళ్లను జైల్లో ఉంచుతున్నారు. రూ.వేల కోట్ల తిన్న వాళ్లు బయట ఉన్నారు. రూ.వందల కోట్ల అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయన్నుఅక్రమ పద్ధతిలో అరెస్టు చేశారు.. అది సరికాదు. ఆయనేం దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు.

కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్  ప్రతిపక్ష నేతలను మానసికంగా ఇబ్బందులు పెట్టేలా వారిపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబును దెబ్బకొడితే భాజపాకు బూస్ట్ అవుతుందనేది మోదీ ప్లాన్. ఎన్నో కేసులు ఉన్న జగన్‌ను పక్కన పెట్టేయడం ఆయనకు పెద్ద పనేం కాదు. జగన్‌కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదు. దేశంలో నిజమైన కూటమి అంటే భాజపా - భారాస- ఎంఐఎం. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత్, దక్షిణ భారత్‌ అంటూ విడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు నిశ్చితార్థం వరకే వచ్చింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. మా పార్టీకి సంబంధించి అక్కడ పొత్తులపై ఇప్పుడేం ఆలోచించలేదు’’ అని నారాయణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని