Janasena: రాష్ట్ర చరిత్రలోనే రూ.వేలకోట్ల కుంభకోణం: జనసేన నేత పీతల మూర్తియాదవ్‌

రాష్ట్ర చరిత్రలోనే రూ.వేల కోట్ల భూ కుంభకోణం విశాఖపట్నం ప్రాంతంలో జరిగిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అన్నారు.

Published : 28 May 2024 14:21 IST

విశాఖపట్నం: రాష్ట్ర చరిత్రలోనే రూ.వేల కోట్ల భూ కుంభకోణం విశాఖపట్నం ప్రాంతంలో జరిగిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అన్నారు. ఈ వ్యవహారంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలు గడిచినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మూర్తియాదవ్‌ మాట్లాడారు. 

‘‘ముందస్తుగానే రైతులను ప్రలోభపెట్టారు. మొత్తం ఎసైన్డ్‌ భూములను రాయించుకుని జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఫ్రీహోల్డ్‌ పట్టాలు రైతుల దగ్గరే ఉన్నాయా? వైకాపా నేతల దగ్గర ఉన్నాయా?అని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఆయన నాకు లీగల్‌ నోటీసులు ఇస్తానంటే స్వాగతించా. నేను తప్పుడు ఆరోపణలు చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సుభాష్‌, రాజ్‌కుమార్‌ పేరుతో భూముల రిజిస్ట్రేషన్లు చేశారు. విలువైన భూములు ఎలా చేతులు మారాయో సమీక్ష జరపాలి. స్వయంగా జవహర్‌రెడ్డే డీఆర్‌వోలను భయపెట్టలేదా? రానున్న కూటమి ప్రభుత్వంలో దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. సీఎస్‌ కుమారుడి నేతృత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారించాలి. త్రిలోక్‌, సుభాష్‌ ఎవరు? వారు ఎవరికి బినామీలు? అనే దానిపై విచారణ చేపట్టాలి. ఇప్పటికైనా నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలి. అలా జరిగితే సీపీ దగ్గరికి వెళ్లి లొంగిపోతా. ఆధారాలతో మాట్లాడుతున్నాం. చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పలేక బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని మూర్తియాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు