MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

Updated : 27 May 2024 10:14 IST

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భాజపా నుంచి ప్రేమేందర్‌రెడ్డి, భారాస తరఫున రాకేశ్‌రెడ్డి బరిలో నిలిచారు. 

మరోవైపు పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. భువనగిరి డివిజన్‌ పరిధిలో 22, చౌటుప్పల్‌ డివిజన్‌ పరిధిలో 15 కలిపి మొత్తం 37  కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్‌ కళాశాలలో భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని