Janasena: నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి?: పవన్‌

తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ అన్నారు.

Published : 02 Mar 2024 12:38 IST

అమరావతి: తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మహిళను వైకాపా సర్పంచి అనుచరుడు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేసిన ఘటనపై పవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుంటారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైకాపా వాళ్లే నీరు తాగాలి.. వైకాపా వాళ్లే గాలి పీల్చాలి అనే రీతిలో భవిష్యత్తులో జీవో ఇస్తారేమో.. పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఏపీలో రాజ్యమేలుతోంది. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ.. నా ఎస్సీ.. అనే అర్హత ఉందా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని