Ponnam Prabhakar: అమలు చేయని హామీలపై చర్చకు భాజపా సిద్ధమా?: మంత్రి పొన్నం ప్రభాకర్‌

కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే భాజపా నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Published : 14 Apr 2024 13:57 IST

కరీంనగర్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే భాజపా నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని భాజపా నాయకులు.. ఇప్పుడెలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అంబానీ, అదానీకి దోచిపెడుతోంది.. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు.

‘‘నరేంద్ర మోదీ సర్కారు విభజన హామీలు అమలు చేయలేదు. వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ విధించారు. నా తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు? మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫొటోతో ఓట్లు అడగండి.. రాముడి ఫొటోతో కాదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ప్రకృతి వైపరీత్యాలు, కరవుతో నష్టపోయిన రైతులను కేంద్రం ఎందుకు ఆదుకోవడం లేదు? ఎన్నికలు రాగానే ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఈ ఐదేళ్లు ఎక్కడికి పోయారు? అమలు చేయని హామీలపై చర్చకు భాజపా నేతలు సిద్ధమా? రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వడానికి మనసు రాలేదా?’’ అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు