Radikaa Sarathkumar:: రాధిక శరత్‌కుమార్‌కు రూ.53.45కోట్ల ఆస్తులు.. 75 తులాల బంగారం

Radikaa Sarathkumar: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటి రాధికా శరత్‌ కుమార్‌ రూ.53.45కోట్ల సంపద వివరాలు  ప్రకటించారు. 75 తులాల బంగారం, ఇతర ఆస్తులను వెల్లడించారు.

Updated : 26 Mar 2024 16:50 IST

చెన్నై: దేశంలో సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో పలు చోట్ల అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. తమిళనాడు (Tamil Nadu)లోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా (BJP) అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ (Radikaa Sarathkumar) సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45కోట్లుగా ప్రకటించారు.

రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్‌లో పేర్కొన్నారు. రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

కంగనపై కాంగ్రెస్‌ నాయకురాలి అభ్యంతరకర పోస్ట్‌

ఇటీవల రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ (Sarath kumar) తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK)ని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరుదునగర్‌ నుంచి కాషాయ పార్టీ ఆమెను నిలబెట్టింది. ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఇక విరుదునగర్‌ (Virudhunagar)లో ఈ నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ బరిలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు రూ.17.95కోట్ల సంపద ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.2.50లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి ఆభరణాలు కలిపి రూ.11.38కోట్ల చరాస్తులు, రూ.6.57కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ.1.28కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని