Ram Mohan Naidu: వైకాపా అక్రమాలను పార్లమెంట్‌లో ఎత్తిచూపుతాం: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వైకాపా అవినీతిని ఎండగడతామన్నారు.

Published : 05 Dec 2022 19:15 IST

దిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. వైకాపా కోరినట్లుగా అత్యధిక ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ.. వారంతా రాష్ట్ర హక్కులను కేంద్రంలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎంపీ కనకమేడలతో కలిసి ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మేలును కోరే ప్రతిపక్ష పార్టీగా ఈ అంశాలన్నింటినీ డిసెంబరు 7 నుంచి జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. రైల్వేజోన్‌, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా తీరుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అవినీతి గురించి ప్రశ్నించినా, వైకాపా నేతలను నిలదీసినా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, అందుకే తమ వాదనను పార్లమెంట్‌ సాక్షిగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో ముడిపడిన చాలా అంశాలను చర్చకు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తామన్నారు. ప్రజల హక్కులను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతలు దిల్లీలో సొంత అజెండా చూసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని.. దాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని