Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

Updated : 07 Dec 2023 14:40 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు.

కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

రేవంత్‌రెడ్డి జీవిత విశేషాలు..

స్వస్థలం: నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి

తల్లిదండ్రుల: ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ
పుట్టిన తేదీ: నవంబరు 08, 1969
విద్యార్హతలు: డిగ్రీ (ఏవీ కళాశాల, హైదరాబాద్‌)
భార్య: గీత
కుమార్తె: నైమిషా రెడ్డి
నివాసం: జూబ్లీహిల్స్‌

రాజకీయ నేపథ్యం.. పదవులు

2006: స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్జిల్‌ (ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా) జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక
2007-2009: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి)
2009-2014: ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (కొడంగల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు)
2014: మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక (కొడంగల్‌ నుంచే తెదేపా అభ్యర్థిగా గెలుపు)
2014-2017: తెదేపా శాసనసభా పక్షనేత (తెలంగాణ శాసనసభ)
2017 అక్టోబరు: కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
2018: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి
2018: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం
2019 మే: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా(కాంగ్రెస్‌) గెలుపు
2021 జూన్‌ 26: పీసీసీ అధ్యక్షుడిగా నియామకం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని