Sajjala: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాయిస్‌ రికార్డు అయితే, ఫోన్‌ ట్యాపింగ్‌ అంటున్నారు: సజ్జల

2024లో తెదేపా నుంచి కోటంరెడ్డి పోటీ చేసేందుకు గ్రౌండ్‌ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థిని పార్టీ చూసుకుంటుందన్నారు. 

Updated : 01 Feb 2023 19:54 IST

తాడేపల్లి: ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అడ్డదారుల్లోపోవడం సీఎం జగన్‌కు తెలియదన్నారు. వీరి ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం పార్టీకి, ప్రభుత్వానికి లేదన్నారు. ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఎవరో ఆడియో రికార్డింగ్‌ చేస్తే దాన్ని ట్యాపింగ్‌ అంటున్నారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పరుషంగా మాట్లాడిన మాటలు ఎవరో రికార్డింగ్‌ చేసి ఉండొచ్చని, ఆ ఆరోపణలు బయటకు వస్తే దాని గురించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉండొచ్చేమో తెలియదన్నారు. 2024లో తెదేపా నుంచి కోటంరెడ్డి పోటీ చేసేందుకు గ్రౌండ్‌ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థిని పార్టీ చూసుకుంటుందన్నారు.

సీబీఐ నోటీసు ఇచ్చిన నవీన్‌.. సీఎం జగన్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తి అని, నవీన్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడటంలో ఏం అసహజం ఉందో అర్థం కావడంలేదని సజ్జల అన్నారు. చిన్నాన్న చనిపోతే ఆ విషయాన్ని ఫోన్‌ చేసి సమాచారం చెప్పడంలో తప్పేమైనా ఉందా? అని ప్రశ్నించారు. హత్య కేసులో కావాలని రాజకీయం చేస్తూ కుట్ర కోణం ఉందని చెప్పే ప్రయత్నం జరుగుతుందన్నారు. విశాఖ రాజధాని అవుతుందని సీఎం ప్రకటనలో అసందర్భం ఏముందన్న సజ్జల.. వీలైనంత త్వరగా విశాఖ వెళితే బాగుంటుందని సీఎం భావిస్తున్నారన్నారు. కోర్టు కేసు సమస్యలు పరిష్కారమయ్యాకే తప్పకుండా విశాఖ వెళ్తామని స్పష్టం చేశారు. 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విధానమన్నారు.

రికార్డు చేయించిన వారితోనే రేపు మాట్లాడిస్తాం: బాలినేని

తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్‌ చేయిస్తోందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా వ్యవహారాలు చూస్తోన్న పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయమై నేతలతో సీఎం సమాలోచనలు చేశారు. నెల్లూరు రూరల్‌కు వైకాపా ఇన్‌ఛార్జి పదవి నుంచి కోటంరెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కొత్త ఇన్‌ఛార్జిని ప్రకటిస్తామని సమావేశం అనంతరం బాలినేని తెలిపారు. నెల్లూరులో జరిగిన అన్ని విషయాలను సీఎంతో చర్చించామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని, కాల్‌ వాయిస్‌ రికార్డింగ్‌ జరిగిందన్నారు. కాల్‌ రికార్డింగ్‌ చేసిన కోటంరెడ్డి స్నేహితుడు భయపడి దాక్కున్నాడని, ఫోన్‌ రికార్డు చేయించిన వారితోనే రేపు మాట్లాడిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని