Sanjay singh: కేజ్రీవాల్‌ను తన కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి అనుమతించట్లేదు: సంజయ్‌సింగ్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా కలవడానికి తిహాడ్‌ జైలు అధికారులు అనుమతించట్లేదని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఆరోపించారు.

Updated : 13 Apr 2024 15:26 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా కలవడానికి తిహాడ్‌ అధికారులు అనుమతించట్లేదని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) శనివారం ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “సీఎం కేజ్రీవాల్‌ను మానసికంగా కుంగదీయడానికి కుట్ర జరుగుతోంది. ఆయన తన కుటుంబసభ్యులతో మాట్లాడడానికి గాని, వ్యక్తిగత సమావేశాలకు గాని అనుమతించట్లేదు. వారిని ములాకత్ జంగ్లా ద్వారా మాత్రమే కలవడానికి అనుమతిస్తున్నారు. ఇది అమానుషం. కరడుగట్టిన నేరస్థులకు కూడా తమ కుటుంబాలతో వ్యక్తిగతంగా మాట్లాడుకునే అనుమతిస్తారు.” అని విచారం వ్యక్తంచేశారు. కాగా సంజయ్‌సింగ్‌ ఆరోపణలపై తిహాడ్ జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఏప్రిల్‌ 15న కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ ‘ములాకత్ జంగ్లా’ ద్వారా కలవనున్నారని జైలు అధికారులు శుక్రవారం తెలియజేశారు. అయితే మంగళవారం తిహాడ్‌ జైలులో ముఖ్యమంత్రి, తన సతీమణి సునీతా కేజ్రీవాల్‌, వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌కుమార్‌ను కలిశారు. ‘ములాకత్‌ జంగ్లా’ అనేది జైలు లోపల ఒక గదిలో ఖైదీని, అతడిని చూడడానికి వచ్చిన వారి నుంచి వేరు చేసే ఇనుప మెష్. వారిరువురూ మెష్‌కి ఇరువైపులా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని