Lok Sabha election Results: ‘లక్ష’ణంగా గెలిచారు.. తెలంగాణలో విజేతల మెజార్టీలివే..!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, భాజపా విజయ ఢంకా మోగించాయి.

Updated : 04 Jun 2024 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. భాజపా ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఎంఐఎం తన సీటును పదిలపరుచుకోగా.. భారాస ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, భువనగిరి, నాగర్‌ కర్నూలు, పెద్దపల్లిలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించగా.. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌లలో భాజపా అభ్యర్థులు గెలిచారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి రికార్డు నెలకొల్పారు. దాదాపు 10మంది నేతలు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

  • నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2011లో కడప లోక్‌సభ ఉప ఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో జగన్‌ గెలవగా.. అంతకుమించిన మెజార్టీతో రఘువీర్‌ విజయం సాధించారు. 
  • ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించారు. ఆయన భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • మల్కాజ్‌గిరిలో భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డిపై ఆయన 3,91,4753 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ తన సమీప ప్రత్యర్థి భారాస నేత మాలోతు కవితపై 3.49 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
  • హైదరాబాద్‌లో ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ 3,38,087 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒవైసీకి మొత్తంగా 6,61,981 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి మాధవీలతకు 3.23లక్షలు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 62వేలు, భారాస అభ్యర్థికి 18వేలు చొప్పున  ఓట్లు పోలయ్యాయి
  • కరీంనగర్‌ లోక్‌సభ  సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత వేల్చాల రాజేందర్‌ రావుపై 2,25,209 ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య విజయకేతనం ఎగురవేశారు. భాజపా అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకున్నారు. 
  • భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి డా.బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. 
  • పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. భాజపా అభ్యర్థి శ్రీనివాస్‌పై 1,31,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
  • నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తన సీటును పదిలపరుచుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీ సాధించి జయకేతనం ఎగురవేశారు. 
  • నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి గెలుపొందారు. భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ పోతుగంటిపై 94,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ భారాస అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు దాదాపు 3.2లక్షల ఓట్లు వచ్చాయి.
  • ఆదిలాబాద్‌ లోక్‌సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి నగేష్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన 90,652 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. 
  • జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ తన ప్రత్యర్థి, భాజాపా నేత బీబీ పాటిల్‌పై 46,188 ఓట్ల తేడాతో గెలుపొందారు. 
  • సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
  • మెదక్‌లో భాజపా అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత నీలం మధుపై 39,139 పైచీలుకు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
  • మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో భాజపా అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రౌండ్‌ రౌండ్‌కు ఇక్కడ ఆధిక్యాలు మారడంతో నెలకొన్న ఉత్కంఠ పోరులో డీకే అరుణ కేవలం 4,500 ఓట్లతో గట్టెక్కారు.
  • చేవెళ్లలో భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డిపై దాదాపు 1,72,897 ఓట్ల మెజార్టీ సాధించారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు