PM Modi: మోదీకి సీట్లు ఎందుకు తగ్గాయంటే?

2024 ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 400 సీట్లు సాధించాలన్న టార్గెట్‌ను భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి సాధించలేకపోయింది. ఎందుకిలా జరిగింది అన్న అంశంపైనే చర్చలు సాగుతున్నాయి. మరి ఎందుకిల జరిగింది అంటే.   

Updated : 04 Jun 2024 18:31 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 400 సీట్లు సాధించాలన్న టార్గెట్‌ను భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి పొందలేకపోయింది. అంతదాకా ఎందుకు గత ఎన్నికల్లో వచ్చిన 303 మార్కుని కూడా అందుకోలేకపోయింది. మరి ఎందుకిలా జరిగింది? అందుకే ఏయే కారణాలు దోహదం చేశాయి? 

రిజర్వేషన్ల రద్దు అంశం 

దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. గత రెండు ఎన్నికల్లోనూ వారు భాజపాకు మద్దతు ఇచ్చారు. ఈ దఫా ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామన్నారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దుచేసేందుకే భాజపా 400 సీట్లు కావాలంటోందని ప్రచారం నిర్వహించారు. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లపై భాజపా ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్‌ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం దీన్ని తీసుకెళ్లడంలో విఫలమైంది. 

ఫిరాయింపులతో పార్టీలపై సానుభూతి..

ప్రతి సామాన్యుడు రాజకీయాలను దేశానికి మార్గదర్శకంగా భావిస్తారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయినా మరలా జరిగిన ఎన్నికల్లో ఆయనకు పీఠం కట్టబెట్టారు. అయితే భాజపా అధినాయకత్వం పలురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం ఏక్‌నాథ్‌ శిందే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో బయటపడలేదు. మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ వేత్త శరద్‌ పవార్‌ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. అసలు ఆ విపక్ష ప్రభుత్వాలను కొనసాగించి వుంటే వారిపై ఏర్పడే సహజ సిద్ధ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో భాజపాకు లబ్ధి కలిగించి ఉండేది. 

అగ్నివీర్‌

దేశంలోని యువత ప్రత్యేకించి హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, మహరాష్ట్ర, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌.. తదితర రాష్ట్రాల్లో సైనికదళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీరుచల్లుతూ అగ్నివీర్‌ పథకాన్ని తీసుకువచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా భాజపా అధినాయకత్వం పట్టించుకోలేదు.

పేదలకు అనుకూలంగా ఉండాలి..

దేశంలో పేదలు ఎక్కువగా ఉన్నారు. అసలు తమకు ఎలాంటి పథకాలు ఉన్నాయో కూడా తెలియని అమాయకులు ఎంతో మంది. వీరికి రేషన్‌ అందుతోందా లేదా అన్న అంశంపై స్థానికంగా ఉండే భాజపా, మిత్రపక్షాల కార్యకర్తలు దృష్టిపెట్టాల్సి ఉంది. వందేభారత్‌ తదితర సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. మధ్యతరగతి, ఉన్నత వర్గాలు సమాజంలో తక్కువ ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేది పేదలే. వారికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలి గాని వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు.

జీఎస్టీ పన్ను విధానం

జీఎస్టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడంతో వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు.

పెద్దనేతలను పక్కన పెట్టడం

భాజపాలో పెద్దనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ.. తదితరులను భాజపా నాయకత్వం 75 ఏళ్ల నిబంధనతో పూర్తిగా పక్కనబెట్టింది. పార్టీ శ్రేణుల్లో అధికులు ఈ అంశాన్ని జీర్ణించుకోలేక నిర్లిప్తంగా ఉండిపోయారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు.

ఇండి కూటమిని తక్కువగా అంచనా వేయడం

గడ్డిపరకలను కూడా తక్కువ చేయకూడదు ఈ సూత్రం ఇండి కూటమికి సరిగ్గా వర్తిస్తుంది. ఇండియా కూటమిని భాజపా లెక్కబెట్టలేదు. మోదీ, అమిత్‌షా కాంగ్రెస్‌నీ, రాహుల్‌నీ చులకన చేస్తూ తమ స్థాయికి తగ్గి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేదు. అవి నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి.

పదేళ్ల పాలన..

సహజంగా ఐదేళ్లు పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వం పై విసుగు వస్తుంది. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదే  ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది.

ఉత్తుత్తి సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మి..

తమిళనాడులో అన్నామలై సునామీ సృష్టిస్తాడని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఫలితాలు వచ్చేసరికి అది కేవలం బుడగేనని స్పష్టమైంది. సుదీర్ఘకాలంగా ద్రవిడ రాజకీయాలు ఉత్తరాది రాజకీయపక్షాలకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం సైతం అదే  స్పష్టమైంది. అందుకనే నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మకుండా క్షేత్రస్థాయిలో సమీక్షించగలగాలి.

సీఎంలను మార్చి..

గత డిసెంబరులో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం  అనంతర  సీఎంలను భాజపా నాయకత్వం మార్చింది.  మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మార్చి మోహన్‌ యాదవ్‌ను సీఎంగా చేసింది. ఆ రాష్ట్రంలో శివరాజ్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఆయనను పక్కన బెట్టడం ఓటర్లకు నచ్చలేదు. రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని భజన్‌లాల్‌ శర్మను, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ స్థానంలో విష్ణుదేవ్‌ను సీఎంలుగా నియమించింది. ఈ మార్పును అక్కడి నేతలు, కార్యకర్తలు ప్రశ్నించలేదు. సుదీర్ఘకాలం తమకు సేవలందించిన నేతలను ఒక్కసారిగా కిందకు దించడంపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. సమయం వచ్చింది. ఓటు రూపంలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు