Loksabha Elections: హేమాహేమీలకే దక్కని విజయం.. తరణ్జీత్ సొంతమయ్యేనా?
స్వర్ణదేవాలయానికి నిలయమైన అమృత్సర్ లోక్సభ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జాట్ సిక్కు ఓటర్లను ఆకర్షించేలా అదే సామాజిక వర్గానికి చెందిన తరణ్జీత్ సంధూను బరిలోకి దింపింది.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు పర్యాయాలుగా దేశ వ్యాప్తంగా మోదీ (PM Modi) గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం మాత్రం కాంగ్రెస్దే. అదే స్వర్ణదేవాలయానికి నిలయమైన పంజాబ్లోని అమృత్సర్ (Amritsar Lok Sabha constituency) లోక్సభ నియోజకవర్గం. భాజపా శనివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించిన 11 స్థానాల్లో ఇదొకటి. అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన తరణ్జీత్ సింగ్ సంధూ (Taranjit singh Sandhu) బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్కు మంచి పట్టున్న ఈ స్థానంలో తరణ్జీత్ విజయం నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. కేవలం 5 సార్లు మాత్రమే భాజపా విజయం సాధించింది. 2004-2009 మధ్య కాలంలోనే 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. భాజపా తరఫున నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ గెలుపొందారు.
జైట్లీ, పూరిలకు తప్పని పరాభవం
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున దివంగత అరుణ్ జైట్లీ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిక్కుల అభిమానాన్ని చూరగొనేందుకు కాషాయ దళం హర్దీప్ సింగ్ పూరిని ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆయన కూడా ఘోర పరాభవాన్ని చవి చూశారు. స్థానిక కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ ఔజలా చేతిలో ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్లో గందరగోళం చోటు చేసుకున్న సమయంలో ఔజలా పేరు బాగా వినిపించింది. గ్యాలరీ నుంచి కిందకి దూకిన ఇద్దరు నిందితులను ఈయన, మరో ఎంపీ పట్టుకొని అక్కడి సిబ్బందికి అప్పగించారు. రాజకీయ వర్గాల్లో ఈయన్ని ‘సింగ్ ఈజ్ కింగ్’ అని పిలుస్తారు.
తరణ్జీత్ మూలాలు ఇక్కడివే..
అరుణ్ జైట్లీ, హర్దీప్ సింగ్ పూరి లాంటి కీలక నేతలు బరిలోకి దిగి ఓటమి చెందిన స్థానంలో తరణ్జీత్ నిలదొక్కుకొని ఎలా విజయం సాధిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు తనకు టికెట్ కేటాయించడానికి ముందు నుంచే అమృత్సర్లో గత కొన్నాళ్లుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు తరణ్జీత్ ప్రయత్నిస్తున్నారు. స్థానికేతరుడని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆయన పంజాబ్ మూలాలు కలిగిన వ్యక్తే. ఆయన పూర్వీకులు ఇక్కడే పుట్టిపెరిగారు. సిక్కుల మినీ పార్లమెంట్గా వ్యవహరించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) వ్యవస్థాపక సభ్యుల్లో తరణ్జీత్ తాత సర్దార్ తేజా సింగ్ సముంద్రి ఒకరు. ఆయన తండ్రి గురునానక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పని చేశారు. శిరోమణి అకాళీదళ్ పార్టీ రాజకీయ మనుగడకు కేంద్ర బిందువు ఎస్జీపీసీయేనని చెబుతారు.
భారత రాయబారిగా సేవలు
ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన తరణ్సింగ్.. 1988 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు ఎంపికై ఉక్రెయిన్, శ్రీలంక, అమెరికాలో భారత రాయబారిగా సేవలందించారు. ఇటీవల భారత్- కెనడా మధ్య చోటుచేసుకున్న దౌత్యసంబంధమైన సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారు. అమృత్సర్లో విజయం సాధించాలంటే జాట్ సిక్కు వర్గానికి చెందిన తరణ్జీత్ సరైన వ్యక్తి అని భాజపా అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. అంతేకాకుండా ఆయన కుటుంబ నేపథ్యం, దార్శనికతే విజయం దిశగా అడుగులు వేయిస్తాయని స్థానిక నేతలు అంటున్నారు. ఈ స్థానానికి చివరి విడతగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు భాజపా తాజా జాబితాలో పంజాబ్లోని పటియాలా నుంచి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, లుథియానా నుంచి మరో మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్, గుర్దాస్పుర్ నియోజకవర్గంలో నుంచి సినీనటుడు సన్నీ దేవోల్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే రాకుడ్ దినేశ్ సింగ్ చోటు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!