Yamini: విశాఖలో డ్రగ్స్‌.. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది: సాధినేని యామిని

విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామినీశర్మ అన్నారు.

Updated : 22 Mar 2024 13:53 IST

విజయవాడ: విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామినీశర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్‌ విభాగం డ్రగ్స్‌ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని.. మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. 

కూనం వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో విశాఖకు కంటెయినర్‌ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైకాపాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అతడి సోదరుడు కూడా ఆ పార్టీ నాయకుడేనని చెప్పారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసినా అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరిపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని