IND vs AUS: అహ్మదాబాద్‌ పిచ్‌పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు

తొలి మూడు టెస్టుల్లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్‌ పిచ్‌ నుంచి బౌలర్లకు పూర్తిస్థాయిలో సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా సోషల్‌ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 11 Mar 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోపే ముగియడంతో పిచ్‌లపై అనేక ప్రశ్నలు వచ్చాయి. రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్‌ గెలిచింది. స్పిన్‌కు అనుకూలంగా భారత్ పిచ్‌లను తయారు చేసుకుందని ఆసీస్‌ మాజీలు విమర్శలు గుప్పించారు. అయితే, మూడో టెస్టులో పర్యాటక జట్టు విజయం సాధించడంతో వారి నోళ్లు మూత పడినప్పటికీ.. ఐసీసీ మాత్రం ఇందౌర్‌ పిచ్‌కు ‘పేలవం’ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్‌ పిచ్‌ వాటన్నింటికీ భిన్నంగా ఉంది. బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారింది. దీనిపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 

‘‘ఒక విపరీతమైన చర్యను సమర్థించడానికి ఎప్పుడూ మరొక విపరీతమైన చర్య కారణంగా లేదా సాకుగా ఉండకూడదు’’ అని చోప్రా పోస్టు చేశాడు. తొలి మూడు టెస్టుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉందనే విమర్శలను తిప్పికొట్టడానికి.. ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌ను తయారు చేయడం సరైన పద్ధతి కాదనే విధంగా తన స్పందనను తెలియజేశాడు. అహ్మదాబాద్‌ మైదానంలో రెండో రోజు చివర్లో పది ఓవర్లు మినహా.. ఆసీస్‌ బ్యాటర్లే బ్యాటింగ్‌ చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులు సాధించింది. కానీ, ఇదే పిచ్‌పై రవిచంద్రన్ అశ్విన్‌ 6 వికెట్లు తీసి రాణించాడు. సరైన ప్రాంతంలో బంతులేస్తే వికెట్లు తీయొచ్చని నిరూపించాడు. అయితే, బ్యాటింగ్‌కు అనుకూలమనేది కాదనలేని సత్యం. ఎందుకంటే ఇప్పుడు భారత్‌ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో ధాటిగానే ఆడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని