Chennai: చెన్నై ఇప్పటికీ మూడు లేదా నాలుగులో నిలవొచ్చు.. ఎలాగంటే?

భారత టీ20 లీగ్‌ అత్యంత కీలక దశకు చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లో ఆదివారం నాటికి 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే  మిగిలాయి...

Published : 10 May 2022 02:21 IST

భారత టీ20 లీగ్‌ కీలక దశకు చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లో ఆదివారం నాటికి 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే  మిగిలాయి. దీంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ ప్రతి జట్టుకూ చాలా కీలకమైనది. ఇప్పుడు టాప్‌-4లో నిలిచిన లఖ్‌నవూ, గుజరాత్, రాజస్థాన్‌, బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్‌ చేరేలా కనిపిస్తున్నా మిగతా జట్లూ టాప్‌లోకి దూసుకొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా రాణిస్తే  మూడు లేదా నాలుగులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ముంబయి: ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలే సాధించింది. దీంతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. ఇకపై బాగా ఆడి, మిగిలిన మ్యాచ్‌లన్నింటిలో గెలిచినా గరిష్ఠంగా ఐదో స్థానంలోనే నిలుస్తుంది.

కోల్‌కతా: కోల్‌కతా ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై అద్భుతంగా పుంజుకొని రాణించినా లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి గరిష్ఠంగా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అది కూడా ఇతర జట్లతో పోటీపడాల్సిన స్థితిలోనే. ఇది జరగాలంటే అద్భుతమే అని చెప్పాలి.

చెన్నై: ప్రస్తుతం కోల్‌కతా మాదిరే చెన్నై 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆదివారం దిల్లీని ఓడించడంతో కాస్త ఉపశమనం లభించింది. దీంతో ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ ఇలాగే గొప్ప విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సమానంగా 14 పాయింట్లు పంచుకునే వీలుంది. అప్పుడు వాటి కన్నా రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి.

పంజాబ్‌: పంజాబ్‌ ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్‌లు గెలవాలి. అప్పుడు రెండు, మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అది కూడా ఇతర జట్లతో రన్‌రేట్‌ పరంగా మెరుగ్గా ఉంటేనే. అది జరగాలంటే ఇకపై విశేషంగా రాణించాలి.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఇప్పుడు 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే ఆరో స్థానంలో నిలిచింది. ఇకపై మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే టాప్‌-4లో ఎక్కడైనా నిలవొచ్చు. కానీ ఆదివారం బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో అవకాశాలు క్లిష్టంగా మారాయి.

దిల్లీ: దిల్లీ కూడా హైదరాబాద్‌లాగే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా టాప్‌-4లో ఎక్కడైనా నిలవొచ్చు. అయితే, ఇతర జట్లతో పాయింట్లు సమానంగా ఉంటే రన్‌రేట్‌ అత్యంత కీలకం అవుతుంది.

బెంగళూరు: బెంగళూరు ప్రస్తుతం ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్‌-1లో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు టాప్‌లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

రాజస్థాన్‌: రాజస్థాన్‌ ఇప్పుడు బెంగళూరు మాదిరే 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో టాప్‌-3లో ఉంది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే టాప్‌-1లో ప్లేఆఫ్స్‌ చేరుతుంది. అందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.

గుజరాత్‌: గుజరాత్‌ వరుస విజయాలతో మొన్నటివరకూ టాప్‌-1లో నిలిచినా రెండు వరుస అపజయాలతో ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించింది. ఒకవేళ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా నాలుగోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.

లఖ్‌నవూ: లఖ్‌నవూ ఇప్పుడు వరుస విజయాలతో టాప్‌లో దూసుకుపోతోంది. గుజరాత్‌లాగే ఈ జట్టు కూడా 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. అవి ఓడిపోయినా ప్లేఆఫ్స్‌ చేరే వీలుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించడం అందుకు కారణం.

నోట్‌: ఇక్కడ చెప్పిన విషయాలన్నీ జరగాలంటే ప్రతి జట్టూ ఇకపై తాము ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. అది కూడా నెట్‌రన్‌ పరంగా ఇతర జట్లతో నెగ్గుకొస్తేనే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని