Commonwealth Games: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ప్రస్థానం...అసాధారణం..!

క్రికెట్‌ ప్రపంచకప్‌, ఫిపా వరల్డ్‌కప్‌, ఒలింపిక్స్‌లానే.. కామన్వెల్త్‌ గేమ్స్‌ కూడా క్రీడా అభిమానులను అలరించడానికి వచ్చే అతి పెద్ద క్రీడా ఈవెంట్.

Published : 03 Aug 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రపంచకప్‌, ఫిపా వరల్డ్‌కప్‌, ఒలింపిక్స్‌లానే.. కామన్వెల్త్‌ గేమ్స్‌ కూడా క్రీడా అభిమానులను అలరించడానికి వచ్చే అతి పెద్ద క్రీడా ఈవెంట్. ఎన్నో రకాల క్రీడలు.. విభిన్నమైన ఆటగాళ్లు.. తీవ్రమైన పోటీని తట్టుకొని ఒక పతకం సాధిస్తే అది ఎంతో గొప్ప విషయం. కనీస వసతులు లేక.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది ఆటగాళ్లను కామన్వెల్త్‌ క్రీడలు వెలుగులోకి తీసుకొచ్చాయి. సరిగా 92 ఏళ్ల క్రితం మొదలైన ఈ మహా సంగ్రామంలో భారత్‌ 1934లో తొలి పతకం రుచి చూసింది. అయితే, అప్పటినుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు పతకాలు నెగ్గడం అలవాటుగా మార్చుకుంది. . ఈ నేపథ్యంలో భారత్‌ సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగిందో చుద్దాం.. 

1 నుంచి 101 వరకు.. అద్భుతమైన జర్నీ ..

  • కామన్వెల్త్‌ క్రీడలకు 1930లో బీజం పడింది. భారత్‌ తొలిసారిగా 1934(లండన్‌)లో పోటీ చేసి ఒక పతకాన్ని నెగ్గింది. పురుషుల 74కేజీల (రెజ్లింగ్‌ ) విభాగంలో రషీద్‌ అన్వర్‌ భారత్‌కు తొలి పతకాన్ని( కాంస్యం) అందించాడు.
  • ఆస్ట్రేలియా( సిడ్నీ)వేదికగా 1938లో రెండోసారి భారత్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీ చేసింది. ఈ క్రీడల్లో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు. సైక్లింగ్‌ విభాగంలో భారత్‌ పతకం నెగ్గుతుందని భావించిన నిరాశే మిగిలింది.
  • 1942, 1946లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడలు రెండో ప్రపంచయుద్ధం కారణంగా జరగలేదు. 1950లో తిరిగి ప్రారంభంఅయినా, భారత్‌ పాల్గొనలేదు.ఆ తరవాత అనివార్య కారణాల వల్ల 1962, 1986 క్రీడల్లో కూడా భారత్‌ పోటీ చేయలేదు.
  • కెనడాలో జరిగిన 1954 పోటీల్లో భారత్‌ మళ్లీ  ఒక్క పతకం కూడా నెగ్గలేదు. ఆ తర్వాత 1958 వేల్స్‌లో జరిగిన క్రీడల్లో భారత్‌ తొలిసారి బంగారు పతకాన్ని గెలిచింది. మొత్తం 3 పతకాలు( 2 బంగారు, 1 రజతం) దక్కించుకొంది.  మిల్కాసింగ్‌( అథ్లెటిక్స్‌), లైలారామ్‌( రెజ్లింగ్‌)లో బంగారు పతకాలు సాధించారు. కంటి పాండే( రెజ్లింగ్‌) రజత పతకాన్ని గెలిచాడు.
  • జమైకాలో వేదికగా 1966లో ఐదో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 10 పతకాలు ( 3 బంగారు, 4 వెండి, 3 కాంస్యం)  సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్‌ ఈ టోర్నీలోనే అత్యధిక క్రీడల్లో (అప్పటివరకు) పోటీ చేసింది.
  • 1970 (స్కాట్లాండ్‌) పోటీల నుంచి భారత్‌ ప్రదర్శన మెరగయ్యింది. 1970లో 12, 1974లో 15, 1978లో 15, 1982లో 16 పతకాలు సాధించి, వరుసగా నాలుగు కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ ఆరో స్థానంలో నిలిచింది. 
  • న్యూజిలాండ్‌ వేదికగా 1990లో జరిగిన పోటీల్లో భారత్‌ అద్భుత ప్రదర్శన( 32 పతకాలు, 13 గోల్డ్‌, 8 వెండి, 11 సిల్వర్‌)  చేసి టాప్‌ 5లోకి తొలిసారి వచ్చింది. ఈ క్రీడల్లో భారత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలోనే 12 స్వర్ణాలను నెగ్గడం విశేషం.
  • 1994లో 24 పతకాలతో ఆరో స్థానంలో నిలిచిన భారత్‌, 1998లో 25 పతకాలు సాధించి, ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, 2002 నుంచి భారత్‌ జోరు మళ్లీ మొదలైంది.
  • మాంచెస్టర్‌ వేదికగా జరిగిన 2002 పోటీల్లో భారత్‌ తొలిసారి 50 పతకాల మార్క్ అందుకొని టాప్‌ 4లోకి వచ్చింది. ఈ టోర్నీలో 30 బంగారు, 22 రజత, 17 కాంస్యలతో కలిపి మొత్తం 69 పతకాలను గెలుచుకొంది. షూటింగ్‌లో ఏకంగా 14 స్వర్ణపతకాలు నెగ్గింది. ఈ క్రీడల్లోనే భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలిచి రికార్డు సృష్టించింది.
  • 2006(మెల్‌బోర్న్) కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది. 183మంది క్రీడాకారులను ఆస్ట్రేలియా పంపింది. 2004 సమ్మర్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌ సింగ్‌ను పతాకధారుడుగా వ్యవహరించాడు. ఈ పోటీల్లో భారత్‌ 50 పతకాలు( 22 బంగారు, 17 వెండి,11 కాంస్య) నెగ్గి నాలుగో స్థానంలో నిలిచింది.
  • స్వదేశంలో జరిగిన 2010 పోటీల్లో భారత్ పతకాల మోత మోగించింది. తొలిసారి 100 పతకాల మార్క్‌ అందుకొని రెండో స్థానంలో నిలిచింది.  మొత్తంగా 101 పతకాలు( 38 బంగారు, 27 రజత, 36 కాంస్య) నెగ్గి రికార్డు సృష్టించింది. భారత్‌ తొలిసారి జిమ్నాస్టిక్స్‌లో( ఆశిశ్‌కుమార్‌ రజతం, కాంస్యం) పతకం గెలిచింది. మొట్టమొదటిసారి మహిళల రెజ్లింగ్‌లో గీతా ఫొగాట్‌ స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టింది.
  • 2014 (గ్లాస్గో) పోటీల్లో భారత్ 64 పతకాలు( 15 బంగారు, 30 రజత, 19 కాంస్య) సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ తరఫున సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వికాస్‌ గౌడా పురుషుల డిస్కస్‌త్రో లో స్వర్ణం నెగ్గి 56 ఏళ్ల తరవాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించాడు. జోస్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ స్కాష్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టారు. పారుపల్లి కశ్యప్‌  బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకాన్ని గెలిచిన తొలి షట్లర్‌గా రికార్డులెక్కాడు. దీపా కర్మాకర్‌ జిమ్నాస్టిక్స్‌లో రజతం నెగ్గి, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.
  • ఆసీస్‌ వేదికగా 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ భారత్‌ 26 స్వర్ణాలు, 20 సిల్వర్, 20 కాంస్య పతకాలతో మొత్తం 66 మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో మూడో స్థానంతో టోర్నీని ముగించింది. ఈ పోటీల్లో భారత్‌ నుంచి పురుషులు 113 మంది, మహిళలు 103 మంది పాల్గొన్నారు. భారత్‌  షూటింగ్‌లో ఏడు, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో ఐదేసి బంగారు పతకాలు వచ్చాయి. టేబుల్‌ టెన్నిస్‌ (3), బాక్సింగ్‌ (3), బ్యాడ్మింటన్ (2), అథ్లెటిక్స్‌ (1) గెలుచుకుంది. ఇక షూటింగ్‌లో నాలుగు.. రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌ పోటీల్లో మూడేసి.. టేబుల్ టెన్నిస్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, స్క్వాష్ గేముల్లో రెండేసి.. రజతాలు దక్కాయి. ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా 198 పతకాలు (80గోల్డ్‌, 59 రజత, 59 కాంస్య) నెగ్గిలో టాప్‌లో నిలిచింది. ఇంగ్లాండ్‌ 136(45 గోల్డ్‌,45 రజత, 46 కాంస్య)తో రెండో స్థానం దక్కించుకొంది.
  • కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకూ భారత్‌ 503 పతకాలను సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అందులో 181 స్వర్ణ, 173 రజత, 149 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ పోటీల్లో భారత్‌ ఇప్పటికి 10 పతకాలు (4 స్వర్ఱాలు, 3 రజతాలు, 3 కాంస్యలు) సాధించి ఆరోస్థానంలో కొనసాగుతోంది.

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో...

  • వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (మహిళల 49 కిలోలు) బంగారు పతకం
  • జెరెమీ లాల్రిన్నుంగా (పురుషుల 67 కిలోలు)  బంగారు పతకం
  • అంచిత షెలీ (పురుషుల 37 కిలోలు) బంగారు
  • సంకేత్ మహదేవ్ (పురుషుల55 కిలోలు) వెండి
  • బింద్యారాణి దేవి( మహిళల 55 కిలోలు) వెండి
  • గురురాజా పూజారి(61 కేజీలు పురుషుల) కాంస్యం
  • హర్జిందర్‌ కౌర్‌(మహిళల 71 కిలోలు) కాంస్యం
  • సుశీల దేవి( జూడో) వెండి పతకం, విజయ్‌ కుమార్‌( జూడో) కాంస్యం
  • లాన్‌ బౌల్స్‌ ఉమెన్స్‌ ఫోర్స్‌ ఈవెంట్‌లో లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోనీ సాయికియా, రూపారాణి బంగారు

భారత్‌ 18వ సారి కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీపడుతోంది. ఈ సారి భారత్‌ తరఫున 215 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. 15 వేదికల్లో 20 క్రీడల్లో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ క్రీడలతో కలిపి 280 పతకాంశాల్లో అథ్లెట్లు తలపడుతున్నారు. భారత్‌ తరఫున అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి. సింధు, హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ పతకదారులుగా వ్యవహరిస్తున్నారు.

కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో భారత్‌కు అత్యధిక పతకాలు(135) తెచ్చిపెట్టిన షూటింగ్‌ను ఈ సారి నిర్వహించడం లేదు. దీంతో భారత్‌కు పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే భారత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల మోత మోగిస్తోంది.. మరోవైపు జుడో వంటి పోటీల్లో పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పతకం ఖాయంకాగా ‌, తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌ల్లో పతకం ఖాయం చేసుకొనేందుకు భారత ఆటగాళ్లు శ్రమిస్తున్నారు....ఏం జరగుతుందో తెలియాలంటే ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని