Duplessis: కెప్టెన్‌గా.. వారిలా మాత్రం ఉండలేను: డుప్లెసిస్‌

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఈసారి ఎలాగైనా తన జట్టును ప్లేఆఫ్స్‌లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతోనూ అదరగొట్టేస్తున్నాడు.

Published : 17 May 2023 14:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగా.. అందులోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌ ఓడినా సరే ఆశలు గల్లంతే. గురువారం హైదరాబాద్‌తో, మే 21న గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతూ జట్టును నడిపిస్తున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న డుప్లెసిస్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మాదిరి సారథిగా ఉండలేనని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌తోపాటు రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కు ఆడిన డుప్లెసిస్‌ గతేడాది నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతోన్న విషయం తెలిసిందే. అయినా ధోనీ కెప్టెన్సీని మాత్రం అభినందించకుండా ఉండడు. 

‘‘ఇద్దరు అద్భుతమైన క్రికెటర్లు, కెప్టెన్ల వద్ద ఆడటం బాగుంది. వారి నుంచి ఎంతో నేర్చుకోగలిగా. నేను జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా గ్రేమీ స్మిత్‌ సారథిగా ఉండేవాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరఫున తొలి సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయినా, అక్కడ నుంచి చాలా అంశాలను నేర్చుకున్నా. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ దగ్గరే కూర్చొని ప్రతి విషయం గురించి అడిగేవాడిని. ఎక్కువగా నాయకత్వంపైనే మాట్లాడేవాడిని. ధోనీని దూరం నుంచే పరిశీలించేవాడిని. చాలా సంవత్సరాలుగా ఎందుకు అతడు విజయవంతమయ్యాడని ఆలోచించా. కానీ, ఎప్పుడూ కూడా ఎంఎస్ ధోనీ, గ్రేమీ స్మిత్, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, విరాట్ కోహ్లీలా మారాలని ప్రయత్నించలేదు. నాదైన శైలిలోనే జట్టును నడిపించడం నేర్చుకున్నా.  

అయితే, ఎంఎస్ ధోనీ నుంచి నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకున్నానని చెప్పగలను. నా ఆటగాళ్లకు సంబంధించి నేను చాలా స్పష్టతతో ఉంటానని నాకు తెలుసు. మీ పూర్తిస్థాయి ప్రదర్శనను ఇవ్వండి చాలు అని వారికి చెబుతుంటా. ఇలా చేయడం వల్లే ధోనీని ‘కెప్టెన్‌ కూల్‌’గా అభిమానులు పిలుచుకుంటారు. ధోనీని మించిన మరొక సారథి ఉండడు’’ అని డుప్లెసిస్‌ ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని