IND vs ENG: ఉప్పల్‌ గడ్డ.. టీమ్‌ఇండియా అడ్డా.. టెస్టుల్లో ఓడిపోని చరిత్ర!

ఉప్పల్‌ వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల (IND vs ENG) మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

Updated : 22 Jan 2024 17:20 IST

ఓ వైపు బజ్‌బాల్‌ ఆటతీరుతో టెస్టుల్లో దూసుకెళ్తోన్న ఇంగ్లాండ్‌. మరోవైపు సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ఆటతో సాగిపోతున్న టీమ్‌ఇండియా. ఇక సొంత గడ్డపై భారత్‌కు (IND vs ENG) తిరుగే లేదు. ప్రపంచ క్రికెట్లో బలమైన ఈ రెండు జట్ల మధ్య ఇప్పుడు టెస్టు సమరానికి సమయం ఆసన్నమవుతోంది. స్వదేశంలో అయిదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఈ సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్‌ ఈ సిరీస్‌పై పడింది. తొలి టెస్టు గురువారమే (ఈనెల 25న) హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఆరంభమవుతుంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం.. టీమ్‌ఇండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు ఇక్కడ ఓడిందే లేదు.  

అన్నీ భారీ విజయాలే..

2005లో తొలిసారి ఉప్పల్‌లో వన్డే.. మరో ఐదేళ్ల తర్వాత మొదటి టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్‌ఇండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

  • 2010లో ఉప్పల్‌ జరిగిన తొలి టెస్టు (భారత్, న్యూజిలాండ్‌ మధ్య) డ్రాగా ముగిసింది. హర్భజన్‌ సింగ్‌ (111 నాటౌట్‌) అజేయ సెంచరీ సాధించాడు.
  • 2012లో న్యూజిలాండ్‌పైనే ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సొంతం చేసుకుంది. పుజారా (159) ఈ మ్యాచ్‌లో మెరిశాడు. మ్యాచ్‌లో అశ్విన్‌ 12 వికెట్లు పడగొట్టాడు.
  • 2013లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా చిత్తు చేసింది. పుజారా (204) డబుల్‌ సెంచరీ చేశాడు.
  • 2017లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్‌ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి (204) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.
  • 2018లో వెస్టిండీస్‌తో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో పంత్‌ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

కోహ్లికి ఫేవరెట్‌..

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ మైదానం ఫేవరెట్‌ గ్రౌండ్‌ అని చెప్పొచ్చు. ఇక్కడ అతని ప్రదర్శనే అందుకు నిదర్శనం. టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి తనకు అచ్చొచ్చిన వేదికలో ఈసారి మ్యాచ్‌ ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు జట్టులో లేని వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్‌ల్లో అతను 127.50 సగటుతో 510 పరుగులు సాధించాడు. అతనూ ఓ ద్విశతకం చేశాడు. 

ఇక బౌలింగ్‌లో చూసుకుంటే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (8 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు)కు ఇక్కడి పిచ్‌ తలొంచిందనే చెప్పాలి. ఎలా కావాలంటే అలా బౌలింగ్‌ చేస్తూ అశ్విన్‌ వికెట్ల వేట కొనసాగించాడు. ఆ తర్వాత వరుసగా జడేజా (15), ఉమేశ్‌ యాదవ్‌ (15), ప్రజ్ఞాన్‌ ఓజా (9), హర్భజన్‌ సింగ్‌ (7) ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ హైదరాబాద్‌లో టీమ్‌ఇండియా విజయఢంకా మోగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ తమ ఆటతో అలరించి, ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి, సిరీస్‌ను ఘనంగా ఆరంభిస్తే హైదరాబాదీలకు అంతకుమించిన ఆనందం ఉండదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని