Mohammed Siraj: సిరాజ్‌ గొప్ప ఘనత.. వన్డేల్లో నంబర్‌ 1గా హైదరాబాదీ పేసర్‌

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

Updated : 26 Jan 2023 07:33 IST

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో సిరాజ్‌ 729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ (727), న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (708)లను వెనక్కినెట్టి అతడు ఈ ఘనత సాధించాడు. ఏడాదిగా వన్డే క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్న సిరాజ్‌.. సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లలో అదరగొట్టాడు. మరో బౌలర్‌ మహ్మద్‌ షమి 11 స్థానాలు మెరుగై 32వ ర్యాంకు సాధించాడు. వన్డేల్లో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. 20 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లి ఏడో ర్యాంకు సాధించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ రెండు స్థానాలు మెరుగై స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.


గల్లీ నుంచి..

హైదరాబాద్‌ గల్లీల్లో తన క్రికెట్‌ ప్రస్థానాన్ని ఆరంభించిన సిరాజ్‌.. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌ పేసర్‌గా ఎదిగాడు. పరుగులు ఇవ్వడం తప్ప వికెట్లు పడగొట్టడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న అతను.. ఇప్పుడు జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. అతనీ స్థాయికి చేరడం వెనుక ఎంతో కష్టం ఉంది. 2019లో వన్డే అరంగేట్రం చేశాక ఈ ఫార్మాట్లో రెండో మ్యాచ్‌ ఆడేందుకు మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి,  ఒక్క వికెట్‌ కూడా తీయలేక జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. షమి, భువనేశ్వర్‌, బుమ్రా ప్రధాన పేసర్లుగా కొనసాగుతుండడం, మధ్యలో కరోనా కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. అయినా నిరుత్సాహపడలేదు. ఇలాంటి అడ్డంకులు అతనికి కొత్తమీ కాదు. పేదరికం నుంచి వచ్చి, తండ్రి (ఇప్పుడు లేరు) ప్రోత్సాహంతో ఎదిగిన అతను మరోసారి శ్రమనే నమ్ముకున్నాడు. సాధనకు అధిక సమయం కేటాయించాడు. సరైన ప్రదేశాల్లో కచ్చితమైన లైన్‌తో బౌలింగ్‌ చేయడంపై పట్టు సాధించాడు. ఇన్‌స్వింగ్‌, ఔట్‌స్వింగ్‌ రాబట్టడంలో రాటుదేలాడు. ఇప్పుడు పరిపూర్ణ పేసర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

టెస్టుల్లో మెరుగైన ప్రదర్శనతో గతేడాది ఫిబ్రవరిలో వన్డేల్లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి ఆడిన 20 వన్డేల్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతని బౌలింగ్‌ చూస్తేనే.. ఎంతగా పురోగతి సాధించాడో అర్థమవుతోంది. వికెట్ల ఆకలితో, కసిగా బంతులేస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తున్నాడు. ఇప్పుడు కపిల్‌దేవ్‌, బుమ్రా తర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న మూడో భారత పేసర్‌గా సిరాజ్‌ నిలిచాడు. 2022కి గాను ఐసీసీ పురుషుల వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. తరచూ గాయాల కారణంగా బుమ్రా జట్టుకు దూరమవుతుంటే, షమికి నిలకడ లోపించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టుకు ఇప్పుడు సిరాజ్‌ కీలకంగా మారాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు