Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్‌

ఆంధ్ర కెప్టెన్‌ హనుమ విహారి గొప్ప పోరాటం ప్రదర్శిం చాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు అవేశ్‌ బౌన్సర్‌ తగిలి అతని ఎడమ చేతి మణికట్టులో చీలిక వచ్చింది.

Updated : 02 Feb 2023 10:39 IST

ఇండోర్‌: ఆంధ్ర కెప్టెన్‌ హనుమ విహారి గొప్ప పోరాటం ప్రదర్శిం చాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు అవేశ్‌ బౌన్సర్‌ తగిలి అతని ఎడమ చేతి మణికట్టులో చీలిక వచ్చింది. దీంతో 16 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. చేతికి కట్టుతో ఉన్న అతను మళ్లీ బ్యాటింగ్‌కు రాడనే అనుకున్నారు. కానీ కీలకమైన క్వార్టర్స్‌ పోరు కావడం.. జట్టుకు వీలైనన్ని ఎక్కువ పరుగులు అందించాలనే ఉద్దేశంతో అతను రెండో రోజు పదకొండో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటరైన అతను ఎడమచేతి వాటానికి మారి.. ఒక్క చేత్తోనే (కుడి) బ్యాటింగ్‌ కొనసాగించాడు. నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం పోరాడాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతను.. రెండు బౌండరీలూ కొట్టాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జత చేసి చివరకు ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 262/2తో బుధవారం ఆంధ్ర బ్యాటింగ్‌ కొనసాగించింది. కరణ్‌ (110) సెంచరీ అందుకోవడం.. మరో ఎండ్‌లో రికీ భుయ్‌ (149) నిలవడంతో జట్టు 323/2తో భారీ స్కోరు దిశగా సాగింది. కానీ ఈ ఇద్దరినీ అనుభవ్‌ అగర్వాల్‌ (4/72) వెనక్కిపంపడంతో ఆంధ్ర త్వరగానే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మధ్యప్రదేశ్‌ 144/4తో రోజు ముగించింది. శుభమ్‌ (51) అర్ధసెంచరీ చేశాడు. శశికాంత్‌ (2/37) రాణించాడు.

కర్ణాటకకు భారీ ఆధిక్యం: ఉత్తరాఖండ్‌తో క్వార్టర్స్‌లో కర్ణాటక పట్టు బిగిస్తోంది. ఇప్పటికే ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 123/0తో బుధవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 474/5తో నిలిచింది. శ్రేయస్‌ గోపాల్‌ (103 బ్యాటింగ్‌) అజేయ శతకం సాధించాడు. మరోవైపు సౌరాష్ట్రతో క్వార్టర్స్‌లో పంజాబ్‌ ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 3/0తో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన ఆ జట్టును ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (126), నమన్‌ ధీర్‌ (131) సెంచరీలతో నడిపించారు. దీంతో 327/5తో ఆ జట్టు బుధవారం ఆట ముగించింది. ఝార్ఖండ్‌తో క్వార్టర్స్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆ జట్టులో అభిమన్యు ఈశ్వరన్‌ (77), సుదీప్‌కుమార్‌ (68) రాణించారు. ఆట చివరకు ఆ జట్టు 238/5తో నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని