సంక్షిప్త వార్తలు (3)

స్విస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ డబుల్స్‌ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీకి చుక్కెదురైంది.

Updated : 23 Mar 2023 09:57 IST

గాయత్రి జోడీకి చుక్కెదురు
లక్ష్యసేన్‌ కూడా ఔట్‌
శ్రీకాంత్‌ ముందంజ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ డబుల్స్‌ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీకి చుక్కెదురైంది. ఆల్‌ ఇంగ్లాడ్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గాయత్రి- ట్రీసా జంటకు స్విస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి- ట్రీసా జోడీ 14-21, 14-21తో రెండో సీడ్‌ అప్రియాని- రమధంతి (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలయింది. సిక్కిరెడ్డి- ఆరతి 12-21, 14-21తో సయాక- షిజు (జపాన్‌) చేతిలో, అశ్విని- శిఖ 17-21, 12-21తో సుపిసర- సుపజిరకుల్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. అతను 21-16, 15-21, 21-18తో చైనా ఆటగాడు వెంగ్‌ హాంగ్‌ను ఓడించాడు. మరో టాప్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతను 18-21, 11-21తో యియు లీ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిథున్‌ మంజునాథ్‌ 21-8, 21-17తో జొరాన్‌ క్వీకెల్‌ (నెదర్లాండ్స్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెటి జోడీ ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. తొలి రౌండ్లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-15, 21-18తో బూన్‌ యువాన్‌- వాంగ్‌ తీన్‌ (మలేసియా) జంటపై విజయం సాధించింది. కృష్ణప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ 16-21, 14-21తో షొహిబుల్‌- మౌలానా (ఇండోనేసియా) చేతిలో, అర్జున్‌- ధ్రువ్‌ 21-17, 18-21, 11-21తో అకిర- తాయ్‌చి (జపాన్‌) చేతిలో ఓడారు.


శరబ్‌జోత్‌కు స్వర్ణం

భోపాల్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పిస్టల్‌/రైఫిల్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు శరబ్‌జోత్‌సింగ్‌, వరుణ్‌ తోమర్‌ సత్తాచాటారు. శరబ్‌జోత్‌ స్వర్ణం, వరుణ్‌ కాంస్య పతకాలతో మెరిశారు. పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ స్వర్ణ పతక పోరులో శరబ్‌జోత్‌ 16-0తో రుస్లాన్‌ లునెవ్‌ (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించాడు. ఇదే విభాగంలో కాంస్యం నెగ్గిన వరుణ్‌ వరుసగా రెండో ప్రపంచకప్‌ పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్లు మను బాకర్‌, దివ్య సుబ్బరాజు, రిథమ్‌ సాంగ్వాన్‌ నిరాశ పరిచారు. దివ్య ర్యాంకింగ్‌ రౌండ్‌ చేరుకోగా.. మను, రిథమ్‌ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు.


మూడో స్థానానికి సిరాజ్‌

దుబాయ్‌: టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే బౌలింగ్‌ జాబితాలో సిరాజ్‌ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంకు సాధించాడు. 702 పాయింట్లతో సిరాజ్‌, ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హేజిల్‌వుడ్‌ (713- ఆస్ట్రేలియా) ప్రథమ, ట్రెంట్‌ బౌల్ట్‌ (708- న్యూజిలాండ్‌) ద్వితీయ ర్యాంకులు సాధించారు. హేజిల్‌వుడ్‌ నంబర్‌వన్‌ స్థానంలో నిలవడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 5, విరాట్‌ కోహ్లి 7, రోహిత్‌శర్మ 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని