సింధు శుభారంభం

స్పెయిన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పి.వి.సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సింధు 21-10, 21-14తో స్టాడెల్‌మాన్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది.

Published : 30 Mar 2023 02:57 IST

గాయత్రి జంట ఔట్‌
వైదొలిగిన సాత్విక్‌ జోడీ
స్పెయిన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పి.వి.సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సింధు 21-10, 21-14తో స్టాడెల్‌మాన్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది. తొలి గేమ్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాతా జోరు ప్రదర్శించిన సింధు తేలిగ్గా తొలి గేమ్‌ నెగ్గింది. రెండో గేమ్‌లో స్టాడెల్‌మాన్‌ భారత షట్లర్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో 11-11తో స్కోరు సమమయ్యాయి. పుంజుకున్న సింధు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 18-13తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ నెగ్గింది. మరోవైపు ఆరో సీడ్‌ లీ మిచెల్‌ (కెనడా)కు ఆకర్షి కశ్యప్‌ షాక్‌ ఇచ్చింది. ఆమె 12-21, 21-15, 21-18తో మిచెల్‌ను ఓడించింది. అస్మిత 21-12, 22-20తో లియోనైస్‌ (ఫ్రాన్స్‌)పై.. మాల్విక 21-19, 16-21, 21-9తో కిసోనా (అమెరికా)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, ప్రియాంశు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌ ముందంజ వేశారు. శ్రీకాంత్‌ 21-11, 25-27, 23-21తో థమాసిన్‌ (థాయ్‌లాండ్‌)పై.. సాయిప్రణీత్‌ 21-16, 18-21, 21-12తో జాన్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గగా.. ప్రియాంశు 18-21, 21-16, 21-11తో స్వెండ్‌సెన్‌ (డెన్మార్క్‌)ను ఓడించాడు. కిరణ్‌ 21-16, 21-14తో సహచరుడు మిథున్‌పై నెగ్గాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి-త్రీసా జాలీకి చుక్కెదురైంది. తొలి రౌండ్లో గాయత్రి జంట 18-21, 16-21తో మియారా-అయాకో (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. ఇటీవలే స్విస్‌ ఓపెన్‌ నెగ్గిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అయాటో-యుటా (జపాన్‌)తో పోరులో తొలి గేమ్‌లో 9-11తో వెనుకబడి ఉన్న సమయంలో సాత్విక్‌కు గాయం కావడంతో భారత జంట పోటీ నుంచి తప్పుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని