క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది.

Published : 31 Mar 2023 01:26 IST

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది. గాయం నుంచి కోలుకున్నాక ఫామ్‌ను అందుకోలేక ఇబ్బంది పడుతున్న సింధు క్వార్టర్స్‌ చేరుకోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఆమె మొదటి గేమ్‌ను ఏకపక్షంగా ముగించింది. 8-1తో మొదలుపెట్టిన ఆమె చూస్తుండగానే 21-14తో తొలి గేమ్‌ గెలుచుకుంది. రెండో గేమ్‌ ప్రథమార్ధం వరకు హోరాహోరీగా సాగింది. సింధు, కుసుమ 8 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 15-13 స్కోరు వరకు ప్రత్యర్థి పోటీలో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన సింధు వరుసగా 4 పాయింట్లతో ముందంజ వేసింది. 19-13తో గేమ్‌కు చేరువైన సింధు.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-16తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆకర్షి కశ్యప్‌ 13-21, 8-21తో నట్సుకీ (జపాన్‌) చేతిలో.. అస్మిత 15-21, 15-21తో యెజియా (ఇండోనేషియా) చేతిలో ఓడారు. మారిన్‌ (స్పెయిన్‌)తో పోరును మాల్విక వాకోవర్‌ ఇచ్చింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21-15, 21-12తో సహచర ఆటగాడు సాయి ప్రణీత్‌పై గెలుపొందాడు. ప్రియాంశు రజావత్‌ 14-21, 15-21తో  పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో.. కిరణ్‌ జార్జ్‌ 17-21, 12-21తో మాగ్నస్‌ జొహానెసెన్‌ (డెన్మార్క్‌) చేతిలో.. సమీర్‌వర్మ 15-21, 14-21తో సనెయమా (జపాన్‌) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి-ఆర్తి 12-21, 13-21తో హిరోకమి-యునా కాటో (జపాన్‌) చేతిలో తలొంచగా.. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ 16-21, 20-22తో మెజాకి-నిషిడా (జపాన్‌) చేతిలో ఓడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని