సెమీస్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీస్‌లో అడుగుపెట్టారు.

Updated : 27 May 2023 04:52 IST

శ్రీకాంత్‌ ఔట్‌

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీస్‌లో అడుగుపెట్టారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత పోరాటంతో వీళ్లు ముందంజ వేశారు. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-16, 13-21, 22-20 తేడాతో యీ మన్‌ జాంగ్‌ (చైనా)పై గెలిచింది. తొలి గేమ్‌ ఆరంభంలో 0-5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత గొప్పగా పుంజుకుని 10-10తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి తనదైన శైలిలో రెచ్చిపోయిన ఆమె ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లింది. స్మాష్‌లు, డ్రాప్‌లతో పాయింట్లు సాధించి తొలి గేమ్‌ సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు ఓటమి తప్పలేదు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పోరు మరోస్థాయికి చేరింది. 17-17తో స్కోరు సమమైన దశలో వరుసగా మూడు పాయింట్లు గెలిచిన సింధు 20-17తో దూసుకెళ్లింది. కానీ జాంగ్‌ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-20తో సింధును అందుకుంది. ఆ తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ సింధు వరుసగా రెండు పాయింట్లతో విజేతగా నిలిచింది. శనివారం సెమీస్‌లో ఏడో సీడ్‌ మరిస్కా తుంజుంగ్‌ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ప్రణయ్‌ 25-23, 18-21, 21-13తో కెంటా నిషిమోటో (జపాన్‌)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ప్రత్యర్థి సవాలును దాటి ప్రణయ్‌ నిలిచాడు. రెండో గేమ్‌లో ఓటమి ఎదురైనా.. బలంగా పుంజుకుని మూడో గేమ్‌లో చెలరేగి గెలుపు ఖాతాలో వేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-16, 16-21, 11-21తో క్రిస్టియన్‌ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. సెమీస్‌లో అడినాటానే ప్రణయ్‌ ఢీకొట్టనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని