MS Dhoni: రాయుడు, జడేజాకు ట్రోఫీ.. అందరినీ ఆకట్టుకున్న అతడి చర్య..

కెప్టెన్‌గా ధోని తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్‌-16 ట్రోఫీ అందుకునే సమయంలో అతడి చర్య అందరినీ ఆకట్టుకుంది. ట్రోఫీ తాను అందుకోకుండా ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన జడేజా, ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన రాయుడులను అందుకోవాలని కోరాడు.

Updated : 31 May 2023 07:59 IST

కెప్టెన్‌గా ధోని తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్‌-16 ట్రోఫీ అందుకునే సమయంలో అతడి చర్య అందరినీ ఆకట్టుకుంది. ట్రోఫీ తాను అందుకోకుండా ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన జడేజా, ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన రాయుడులను అందుకోవాలని కోరాడు. జడేజా, రాయుడు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ నుంచి ట్రోఫీని స్వీకరించారు. ధోని.. బిన్నీ పక్కన నిలబడ్డాడు. తర్వాత అతడు జడేజా, రాయుడులతో పాటు ట్రోఫీని పట్టుకున్నాడు.

అతడు అలా గుర్తుండిపోతాడు.. ధోని: ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేసిన రాయుడు చెన్నై విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతడు మైదానంలో ఉన్నప్పుడు నూరు శాతం శ్రమిస్తాడని ఫైనల్‌ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. ‘‘రాయుడులో ప్రత్యేకత ఏంటంటే.. అతడు మైదానంలో ఉంటే నూరుశాతం శ్రమిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే.. అతడు జట్టులో ఉంటే నేనెప్పుడూ ఫెయిర్‌ ప్లే అవార్డు గెలవను. ఎందుకంటే రాయుడు చాలా త్వరగా స్పందిస్తాడు. కానీ అతడో మంచి క్రికెటర్‌గా నాకు గుర్తుండిపోతాడు. ఎప్పుడూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాడు. మేం భారత్‌-ఎకు ఆడే రోజుల నుంచి చూస్తున్నా.. అతడు స్పిన్‌ బౌలింగ్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌లను సమర్థంగా ఎదుర్కోగలడు’’ అని అన్నాడు.

రాయుడు బై బై: అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ఫైనల్‌ అనంతరం రాయుడు ప్రకటించాడు. ‘‘అన్ని రకాల భారత క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. చిన్నప్పుడు ఇంటి వద్ద క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకున్నప్పుడు టెన్నిస్‌ బంతితో ఆడేవాణ్ని. ఈ అద్భుత ప్రయాణం మూడు దశాబ్దాలు సాగుతుందని ఊహంచలేదు’’ అని రాయుడు సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. ‘‘అండర్‌-15 నుంచి అత్యున్నత స్థాయి వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. తొలిసారి 2013లో టీమ్‌ఇండియా క్యాప్‌ అందుకోవడం నాకిప్పటికీ గుర్తుంది’’ అని చెప్పాడు. తనకిదే చివరి ఐపీఎల్‌ అని రాయుడు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని