IND vs WI: అమెరికాలో అదరగొట్టారు
రికార్డు చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయావకాశాలెక్కువ! టాస్ పోయింది.. వెస్టిండీస్ 179 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ స్టేడియంలో పురుషుల టీ20లో విజయవంతమైన అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులే.
చెలరేగిన యశస్వి, శుభ్మన్
నాలుగో టీ20లో విండీస్ చిత్తు
సిరీస్ సమం చేసిన భారత్
అయిదో టీ20 నేడే
రాత్రి 8 గంటల నుంచి
రికార్డు చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయావకాశాలెక్కువ! టాస్ పోయింది.. వెస్టిండీస్ 179 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ స్టేడియంలో పురుషుల టీ20లో విజయవంతమైన అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులే. ఇలా అన్ని ప్రతికూలాంశాలే. కానీ కరీబియన్ గడ్డ దాటి.. అమెరికాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఓపెనర్లు యశస్వి, శుభ్మన్ వీరవిహారం చేయడంతో నాలుగో టీ20లో టీమ్ఇండియా అలవోకగా విజయాన్ని అందుకుంది. సిరీస్ను 2-2తో సమం చేసింది. నిర్ణయాత్మక అయిదో టీ20 నేడే.
లాడర్హిల్
టీమ్ఇండియా అదరహో! వెస్టిండీస్తో తొలి రెండు టీ20ల్లో ఓడి.. సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడి.. అద్భుతంగా పుంజుకున్న భారత్ వరుసగా రెండో మ్యాచ్లోనెగ్గింది. శనివారం నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసి సిరీస్ సమం చేసింది. మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. హెట్మయర్ (61; 39 బంతుల్లో 3×4, 4×6) అర్ధశతకానికి తోడు.. షై హోప్ (45; 29 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అర్ష్దీప్ సింగ్ (3/38), కుల్దీప్ యాదవ్ (2/26) బంతితో ఆకట్టుకున్నారు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్మన్ గిల్ (77; 47 బంతుల్లో 3×4, 5×6) చెలరేగడంతో భారత్ 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం జరగనుంది.
ఓపెనర్లు అదుర్స్: ఛేదనలో భారత్కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి, శుభ్మన్ తొలి వికెట్కు 165 పరుగుల జోడించి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. గత మ్యాచ్లో టీ20 అరంగేట్రంలో విఫలమైన యశస్వి.. ఈ సారి అవకాశాన్ని వదల్లేదు. ధనాధన్ షాట్లతో చెలరేగాడు. కచ్చితమైన టైమింగ్తో, ఖాళీల్లో నుంచి ఫోర్లు రాబట్టాడు. మోకాలు కింద ఆనించి.. స్కూప్తో అతను సాధించిన ఫోర్ ఆకట్టుకుంది. మరోవైపు శుభ్మన్ కూడా తిరిగి లయ అందుకుంటూ.. దూకుడు ప్రదర్శించాడు. ఒడియన్ స్మిత్ వేసిన ఆరో ఓవర్లో అతను.. పుల్ షాట్తో సిక్సర్, కట్ షాట్తో ఫోర్ రాబట్టిన తీరును చూడాల్సిందే. ఓపెనర్లు తగ్గకపోవడంతో భారత్ 66/0తో పవర్ప్లేను ముగించింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు జోరు కొనసాగించారు. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. బౌండరీలతో స్కోరు వేగం పడిపోకుండా చూశారు. స్పిన్ బౌలింగ్నూ సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పిన్నర్ అకీల్ బౌలింగ్లో శుభ్మన్ తనదైన శైలిలో సగం షాట్తో చూడముచ్చటైన ఫోర్ రాబట్టాడు. వీళ్ల బాదుడుతో 10 ఓవర్లకు సరిగ్గా 100 పరుగులు సాధించిన టీమ్ఇండియా.. లక్ష్యం దిశగా వడివడిగా దూసుకెళ్లింది. ఆ వెంటనే ఓపెనర్లు ఒకరి తర్వాత ఒకరు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు సాధికారికంగా బ్యాటింగ్ కొనసాగించారు. టీ20ల్లో తొలి అర్ధశతకం సాధించిన తర్వాత అకీల్ బౌలింగ్లో రివర్వ్ స్వీప్తో యశస్వి కళ్లుచెదిరే సిక్సర్ కొట్టాడు. తానేమన్నా తక్కువనా అన్నట్లు స్మిత్ బౌలింగ్లో గిల్ ఫైన్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్లోకి పంపించాడు. అదే ఓవర్ను యశస్వి సిక్సర్తో ముగించాడు. ఇలా వీళ్లిద్దరూ బౌండరీల వేటలో పోటీపడడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. మెకాయ్ బౌలింగ్లో వరుసగా 4, 6 బాదిన యశస్వి ఛేదనను వేగవంతం చేశాడు. షెఫర్డ్ ఓవర్లో భారీ సిక్సర్ సాధించిన గిల్.. మరో షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. తిలక్ (7 నాటౌట్)తో కలిసి యశస్వి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
మలుపులు తిరుగుతూ: అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ ఇన్నింగ్స్ మలుపులు తిరుగుతూ సాగింది. బౌలింగ్ దాడిని భారత్ ఆరంభించిన తీరు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ ఆడిన గత రెండు టీ20ల్లో కలిపి అయిదు వికెట్లు తీసిన స్పిన్నర్ అక్షర్ (1/39)తో తొలి ఓవర్ వేయించగా.. ఆ వ్యూహం ఫలితాన్నివ్వలేదు. మేయర్స్ (17) ఓ సిక్సర్, ఫోర్ కొట్టడంతో తొలి ఓవర్లో విండీస్కు 14 పరుగులొచ్చాయి. మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేసిన అర్ష్దీప్.. షార్ట్పిచ్ బంతితో మేయర్స్ను బోల్తా కొట్టించి వికెట్ల ఖాతా తెరిచాడు. కానీ ఓ వైపు అక్షర్ను కొనసాగిస్తూనే.. మరో ఎండ్లో వికెట్ తీసిన అర్ష్దీప్ను కాదని చాహల్ (1/36)కు బంతినివ్వడం కలిసి రాలేదు. ఆ ఓవర్లో విండీస్ 13 పరుగులు రాబట్టింది. మళ్లీ బౌలింగ్కు వచ్చిన అర్ష్దీప్.. కింగ్ (18)ను పెవిలియన్ చేర్చడంతో ఆరు ఓవర్లకు విండీస్ 55/2తో నిలిచింది. ఆ వెంటనే స్పిన్ మాయతో కుల్దీప్ మ్యాచ్ గమనాన్నే మార్చేలా కనిపించాడు. ఒకే ఓవర్లో ప్రమాదకర పూరన్ (1)తో పాటు కెప్టెన్ పావెల్ (1)ను టర్న్తో బుట్టలో వేసుకున్నాడు. కుల్దీప్ ఊరించే బంతితో వరుసగా రెండో మ్యాచ్లోనూ పూరన్ను ఔట్ చేశాడు. చకచకా వికెట్లు కోల్పోయిన విండీస్ ఒక్కసారిగా 57/4తో కష్టాల్లో పడింది. రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన తర్వాత.. హెట్మయర్తో కలిసి హోప్ బౌండరీల వేటలో సాగడంతో 12 ఓవర్లకే స్కోరు వంద దాటింది. కానీ అర్ధశతకం దిశగా సాగుతున్న హోప్ జోరుకు తెరదించి ఈ సారి విండీస్ను చాహల్ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో షెఫర్డ్ (9), హోల్డర్ (3)ను పెవిలియన్ చేర్చిన భారత్.. ఆ తర్వాత పట్టు సడలించింది. హెట్మయర్ను కట్టడి చేయలేకపోయింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు వేగం పడిపోకుండా చూసిన అతను.. అర్ధశతకం అందుకున్నాడు. జట్టుకు పోరాడే స్కోరు అందించిన హెట్మయర్.. ఆఖరి ఓవర్లో ముందుకు డైవ్ చేస్తూ తిలక్ పట్టిన చక్కని క్యాచ్కు నిష్క్రమించాడు. స్మిత్ (15 నాటౌట్) సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. చివరి అయిదు ఓవర్లలో విండీస్ 57 పరుగులు రాబట్టింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) శాంసన్ (బి) అర్ష్దీప్ 17; కింగ్ (సి) కుల్దీప్ (బి) అర్ష్దీప్ 18; హోప్ (సి) అక్షర్ (బి) చాహల్ 45; పూరన్ (సి) సూర్య (బి) కుల్దీప్ 1; పావెల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 1; హెట్మయర్ (సి) తిలక్ (బి) అర్ష్దీప్ 61; షెఫర్డ్ (సి) శాంసన్ (బి) అక్షర్ 9; హోల్డర్ (బి) ముకేష్ 3; స్మిత్ నాటౌట్ 15; అకీల్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-19, 2-54, 3-55, 4-57, 5-106, 6-118, 7-123, 8-167; బౌలింగ్: అక్షర్ 4-0-39-1; అర్ష్దీప్ 4-0-38-3; చాహల్ 4-0-36-1; కుల్దీప్ 4-0-26-2; హార్దిక్ 1-0-14-0; ముకేష్ 3-0-25-1
భారత్ ఇన్నింగ్స్: యశస్వి 84 నాటౌట్; శుభ్మన్ (సి) హోప్ (బి) షెఫర్డ్ 77; తిలక్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 11; మొత్తం: (17 ఓవర్లలో ఒక వికెట్కు) 179; వికెట్ల పతనం: 1-165; బౌలింగ్: మెకాయ్ 3-0-32-0; అకీల్ 4-0-31-0; హోల్డర్ 4-0-33-0; షెఫర్డ్ 3-0-35-1; స్మిత్ 2-0-30-0; పావెల్ 1-0-13-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్