IND vs AUS: మ్యాక్స్‌వెల్‌ ముంచేశాడు

ప్చ్‌.. పొట్టి సిరీస్‌లో భారత్‌కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్‌ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్‌ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Updated : 29 Nov 2023 06:31 IST

శతక్కొట్టిన హిట్టర్‌
223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌
మూడో టీ20లో భారత్‌ ఓటమి
రుతురాజ్‌ సెంచరీ వృథా

ప్చ్‌.. పొట్టి సిరీస్‌లో భారత్‌కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్‌ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్‌ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

గువాహటి : గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (104 నాటౌట్‌, 48 బంతుల్లో 8×4, 8×6) అదరగొట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో అతడు శతక్కొట్టడంతో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. రుతురాజ్‌ మెరుపు సెంచరీ (123 నాటౌట్‌; 57 బంతుల్లో 13×4, 7×6)తో మొదట భారత్‌ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు ట్రావిస్‌ హెడ్‌ (35; 18 బంతుల్లో 8×4), మాథ్యూ వేడ్‌ (28 నాటౌట్‌; 16 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్క వికెటైనా తీయకుండా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్‌ ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. నాలుగో టీ20 శుక్రవారం రాయ్‌పుర్‌లో జరుగుతుంది.

అతడు యథేచ్ఛగా..: టీమ్‌ఇండియాకు విలన్‌ మ్యాక్స్‌వెలే. చెలరేగి ఆడిన అతడు దాదాపు ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేశాడు. ఇతర బ్యాటర్లను అడ్డుకున్నా.. అతడినొక్కడిని నియంత్రించలేక గువాహటిలో భారత జట్టు దెబ్బతింది. ఛేదనలో ఆసీస్‌కు మెరుపు ఆరంభమే లభించింది. హెడ్‌ చెలరేగడంతో నాలుగు ఓవర్లలోనే స్కోరు 46. కానీ 22 పరుగుల వ్యవధిలో.. హెడ్‌ వికెట్‌ సహా మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ పుంజుకుంది. అయితే ఆసీస్‌ను ఒత్తిడి నుంచి బయటపడేస్తూ భారత బౌలర్లపై మ్యాక్స్‌వెల్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. స్పిన్నర్లు అక్షర్‌, బిష్ణోయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్టాయినిస్‌ పరుగులు చేయడానికి కష్టపడ్డా.. మ్యాక్స్‌వెల్‌ దూకుడు కొనసాగించాడు. 13వ ఓవర్లో స్కోరు 128/3. ఆసీస్‌కు అందుబాటులోనే లక్ష్యం. కానీ 8 పరుగుల తేడాలో స్టాయినిస్‌ (17)ను అక్షర్‌, డేవిడ్‌ (0)ను బిష్ణోయ్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. కానీ అది కొద్దిసేపే. వేడ్‌ సహకారంతో మ్యాక్స్‌వెల్‌ జోరు కొనసాగించడంతో ఆసీస్‌ లక్ష్యం దిశగా సాగింది. పేసర్లు అర్ష్‌దీప్‌, అవేష్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాక్స్‌వెల్‌ అంత ఊపులో ఉన్న దశలోనూ ప్రసిద్ధ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఆసీస్‌    చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన పరిస్థితి. భారత్‌కే మంచి అవకాశాలు ఉన్నాయప్పుడు. కానీ గతి తప్పిన బౌలర్లు పేలవ బౌలింగ్‌తో తేలిపోవడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. వేడ్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడం, 4 బైస్‌ రావడంతో 19వ ఓవర్లో అక్షర్‌ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో ప్రసిద్ధ్‌ కాస్తయినా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయలేకపోయాడు. వేడ్‌ ఓ ఫోర్‌ కొట్టి, సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ అలవోకగా రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 4, 4తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. మైదానంలో నిశ్శబ్దం.

రుతురాజ్‌ ధనాధన్‌: భారత ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ ఆటే హైలైట్‌. స్కోరు 200 పరుగులు దాటిందంటే అతడే కారణం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 24 పరుగులకే యశస్వి జైస్వాల్‌ (6), ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్లు కోల్పోగా.. రుతురాజ్‌ క్రీజులో నిలిచినా దూకుడుగా ఆడలేకపోయాడు. మామూలుగా వచ్చి రావడంతోనే రెచ్చిపోయే సూర్య (39; 29 బంతుల్లో 5×4, 2×6) బంతుల్లో ఈసారి అలా చేయలేకపోయాడు. సూర్య క్రమంగా పుంజుకుని బ్యాట్‌ ఝుళిపించినా.. ఇక రెచ్చిపోతాడనుకున్న దశలో ఔటయ్యాడు. రుతురాజ్‌తో మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించి 11వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 81. భారీ స్కోరు కాస్త సందేహంగానే అనిపించింది. కానీ తొలి 21 బంతుల్లో 21 పరుగులే చేసిన రుతురాజ్‌.. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో చెలరేగిపోయాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డుకు జెట్‌ వేగాన్నిచ్చాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. మరోవైపు తిలక్‌ వర్మ (31 నాటౌట్‌; 24 బంతుల్లో 4×4) నిలవగా రుతురాజ్‌.. యథేచ్ఛగా, అలవోకగా షాట్లు ఆడాడు. పుల్‌, స్వీప్‌, కట్‌ షాట్లతో అలరించాడు. స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘా బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని లాఫ్టెడ్‌ షాట్‌తో కవర్‌ మీదుగా సిక్స్‌గా మలిచిన తీరుని చూసి తీరాల్సిందే. మూడు సిక్స్‌లు, ఫోర్‌తో హర్డీ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో 25 పరుగులు రాబట్టిన రుతురాజ్‌.. ఆఖరి ఓవర్లో (మ్యాక్స్‌వెల్‌) మరింతగా రెచ్చిపోయాడు. రుతురాజ్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో మ్యాక్స్‌వెల్‌ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. మరో 20 బంతుల్లోనే సెంచరీ సాధించాడంటేనే ఎంతగా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. తిలక్‌తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు రుతురాజ్‌.. కేవలం 59 బంతుల్లోనే 141 పరుగులు జోడించాడు. ఇందులో తిలక్‌ పరుగులు 31 మాత్రమే.

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) వేడ్‌ (బి) బెరెండార్ఫ్‌ 6; రుతురాజ్‌ నాటౌట్‌ 123; ఇషాన్‌ కిషన్‌ (సి) స్టాయినిస్‌ (బి) రిచర్డ్‌సన్‌ 0; సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) హార్డీ 39; తిలక్‌ వర్మ నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 23 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 222; వికెట్ల పతనం: 1-14, 2-24, 3-81; బౌలింగ్‌: కేన్‌ రిచర్డ్‌సన్‌ 3-0-34-1; బెరెండార్ఫ్‌ 4-1-12-1; ఎలిస్‌ 4-0-36-0; తన్వీర్‌ సంఘా 4-0-42-0; ఆరోన్‌ హార్డీ 4-0-64-1; మ్యాక్స్‌వెల్‌ 1-0-30-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) అవేశ్‌ 35; హార్డీ (సి) ఇషాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 16; ఇంగ్లిస్‌ (బి) బిష్ణోయ్‌ 10; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 104; స్టాయినిస్‌ (సి) సూర్య (బి) అక్షర్‌ 17; డేవిడ్‌ (సి) సూర్య (బి) బిష్ణోయ్‌ 0; వేడ్‌ నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225; వికెట్ల పతనం: 1-47, 2-66, 3-68, 4-128, 5-134; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-44-1; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-68-0; రవి బిష్ణోయ్‌ 4-0-32-2; అవేష్‌ఖాన్‌ 4-0-37-1; అక్షర్‌ పటేల్‌ 4-0-37-1

4

అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌ శతకాల సంఖ్య. అగ్రస్థానంలోని రోహిత్‌ (4)ను సమం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని