ముంబయి జట్టులో శ్రేయస్‌

బీసీసీఐ హెచ్చరికతో ఆటగాళ్లు దారిలోకి వస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబయి సెలక్టర్లు అయ్యర్‌ను ఎంపిక చేశారు.

Published : 28 Feb 2024 01:57 IST

ముంబయి: బీసీసీఐ హెచ్చరికతో ఆటగాళ్లు దారిలోకి వస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబయి సెలక్టర్లు అయ్యర్‌ను ఎంపిక చేశారు. వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్‌ను ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆదేశించినా శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లు విస్మరించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారిద్దరిని కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా నుంచి బోర్డు తప్పించనుందని వార్తలొచ్చాయి. వెన్ను గాయం కారణంతో శ్రేయస్‌ రంజీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యాడు. అయితే అతడు ఫిట్‌గా ఉన్నాడని జాతీయ క్రికెట్‌ అకాడమీలో క్రీడల వైద్య నిపుణుడు నితిన్‌ పటేల్‌ సెలక్టర్లకు లేఖ రాయడం దుమారం రేపింది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో నిరుడు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా తిరిగొచ్చిన కిషన్‌ కూడా ఆట బాట పట్టాడు. డీవై పాటిల్‌ టీ20 మ్యాచ్‌లో ఆర్‌బీఐ తరఫున బరిలో దిగిన అతడు 12 బంతుల్లో 19 పరుగులు చేశాడు. కుర్రాళ్లు ఐపీఎల్‌పై ఆసక్తితో దేశవాళీ క్రికెట్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని భావిస్తోన్న బీసీసీఐ.. ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా నిబంధన తీసుకురావాలని చూస్తోంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడినవారికి నగదు ప్రోత్సాహకం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని