కళ్లన్నీ వినేశ్‌ పైనే

పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.

Published : 19 Apr 2024 03:34 IST

నేటి నుంచి ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌

బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌): పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఈ పోటీల్లో రెండు సార్లు ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు)పైనే అందరి కళ్లు ఉన్నాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేశ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మహిళల్లో రీతిక (76 కేజీలు), అన్షు (57), మాన్సి (62), నిశ (68), పురుషుల్లో అమన్‌ (57), దీపక్‌ పునియా (86), సుజీత్‌ (65), జైదీప్‌ (74), దీపక్‌ (97), సుమిత్‌ (125), గ్రీకో రోమన్‌లో సుమిత్‌ (60), అషు (67), వికాస్‌ (77), సునీల్‌ (87), నితేశ్‌ (97), నవీన్‌ (130) అదృష్టం పరీక్షించుకోనున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న దీపక్‌ పునియా, సుజీత్‌ ఈ పోటీలకు దూరమయ్యేలా ఉన్నారు. శుక్రవారం ఉదయమే వాళ్ల బరువు పరీక్షిస్తారు. అనంతరం పోటీలుంటాయి. కానీ ప్రస్తుతం బిష్కెక్‌ వెళ్లేందుకు అక్కడి నుంచి విమానాలేవీ లేవు. మంగళవారం నుంచి అక్కడే ఉన్న దీపక్‌, సుజీత్‌ నేలపైనే పడుకుంటున్నారు. తినడానికి సరైన ఆహారం కూడా దొరకడం లేదు. వీళ్లతో పాటు కోచ్‌, ఫిజియో కూడా ఉన్నారు. ఈ పోటీల్లో 18 బరువు విభాగాల్లో 36 కోటా స్థానాలు అందుబాటులో ఉన్నాయి.  19 ఏళ్ల అంతిమ్‌ ఇప్పటికే మహిళల 53 కేజీల్లో ఒలింపిక్‌ కోటా సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా క్వాలిఫయర్స్‌లో సెమీస్‌లో గెలిచిన వాళ్లు ఒలింపిక్‌ బెర్తు దక్కించుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని