భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి.
ఈనాడు క్రీడావిభాగం
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. భారత ఫుట్బాల్లో అతడు లేని లోటును పూడ్చడం చాలా కష్టమే.
భారత ఫుట్బాల్ జట్టు అనగానే మొదట వినిపించేది సునీల్ ఛెత్రి పేరే. సాధారణంగా ఎవరినైనా మన జాతీయ ఫుట్బాల్ జట్టులో ఎవరు తెలుసా అని అడిగితే చెప్పేది అతని గురించే. అంతలా భారత ఫుట్బాల్ ముఖచిత్రంలా మారాడు ఛెత్రి. క్రికెట్లో దిగ్గజాలకు కొదవలేదు. కానీ ఫుట్బాల్ విషయానికి వస్తే ప్రస్తుత తరానికి వెంటనే గుర్తొచ్చేది ఛెత్రినే. అతడి ముద్ర అలాంటిది. మేటి క్రీడాకారుడు బైచుంగ్ భుటియా తర్వాత భారత్ నుంచి అతడి స్థాయిని ఇంకెవరూ అందుకోలేరేమో అని అనుకుంటున్న దశలో ఛెత్రి దూసుకొచ్చాడు. 2011లో భుటియా రిటైర్మెంట్ అనంతరం భారత ఫుట్బాల్కు కర్త, కర్మ, క్రియ అతడే. అతడు భుటియాను అందుకోవడమే కాదు.. అతణ్ని మించి ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచ ఫుట్బాల్లో భారత్ స్థానం గురించి వేరే చెప్పక్కర్లేదు. అతి చిన్న దేశాలు సైతం మనకంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుకు ఛెత్రి ప్రధాన ఆకర్షణయ్యాడు. అభిమానులు జట్టు ఆటను చూసేందుకు ఓ ముఖ్య కారకుడయ్యాడు. జట్టు పది మ్యాచ్లు గెలిస్తే అందులో కనీసం ఎనిమిదింట్లో అతడి పాత్ర కీలకమైందంటే అతిశయోక్తి కాదు. ఈ స్టార్ ఫార్వర్డ్కు దూసుకెళ్లడమే తెలుసు. ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆటకు సరైన ఆదరణ దక్కకపోయినా.. తన భుజాలపై భారత ఫుట్బాల్ను మోశాడు. ప్రపంచ వేదికలపై భారత ఉత్తమ ప్రదర్శనకు కారణమయ్యాడు.
రక్తంలోనే..: ఛెత్రి రక్తంలోనే ఫుట్బాల్ ఉంది. 1984 ఆగస్టు 3న సికింద్రాబాద్లోనే ఛెత్రి జన్మించాడు. అతని తండ్రి కేబీ ఛెత్రి ఆర్మీలో పనిచేసేవారు. ఆయన ఆర్మీ ఫుట్బాల్ జట్టుకు ఆడేవారు. సునీల్ తల్లి సుశీల, ఇద్దరు సోదరీమణులు నేపాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. సునీల్కు మొదట్లో ఫుట్బాల్పై ఇష్టం లేదు. టీనేజర్గా ఉన్నప్పుడు అల్లరిగా ఉండేవాడు. ఇతరులను ఆట పట్టించడమే పనిగా చేసుకున్నాడు. కానీ తండ్రికేమో సునీల్ను ఛాంపియన్గా చూడాలనే తపన. తాను సాధించలేదని తనయుడు అందుకోవాలనే కోరిక. కానీ మంచి కళాశాలలో ప్రవేశం కోసం ఫుట్బాల్ మొదలెట్టిన ఛెత్రి.. ఆటతో ప్రేమలో పడ్డాడు. సిటీ క్లబ్ దిల్లీ తరపున 2001లో అడుగుపెట్టాడు. 2002లో మోహన్ బగాన్తో ఒప్పందం అతని కెరీర్లో కీలక మలుపు. 2011 ఆసియా కప్ తర్వాత భైచుంగ్ రిటైర్మెంట్తో సారథ్య పగ్గాలు చేపట్టిన ఛెత్రి అప్పటి నుంచి జట్టును నడిపిస్తున్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టుగా కలిపేస్తూ సాగుతున్నాడు. అతని గోల్ స్కోరింగ్ నైపుణ్యాలు, నాయకత్వ పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిత్రుడు కోహ్లి సలహాతో శాకాహారిగా మారిన అతను.. ఫిట్నెస్ను కాపాడుకుంటూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆటలో కొనసాగుతున్నాడు. ఛెత్రి 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్రత్న పురస్కారాలు అందుకున్నాడు. ఖేల్రత్న పొందిన మొట్టమొదటి ఫుట్బాల్ ఆటగాడు అతనే.
మా ఆట చూడండని..
క్రికెట్ను పిచ్చిగా ఆరాధించే ఈ దేశంలో ప్రస్తుతం అభిమానులు కాస్తయినా ఫుట్బాల్ జట్టును అనుసరిస్తున్నారంటే ప్రధాన కారణం సునీల్ ఛెత్రినే అనడంలో సందేహం లేదు. కానీ రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్బాల్ భారాన్ని మోసిన అతడు.. పెద్ద టోర్నీలు జరుగుతున్నా తమ ఆటను చూడడానికి అభిమానులు స్టేడియాలకు రావట్లేదని ఓ దశలో ఎంతో బాధపడ్డాడు. ‘‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి.. కానీ దయ చేసి స్టేడియాలకు రండి’’ అంటూ 2018 ఇంటర్ కాంటినెంటల్ టోర్నీ సందర్భంగా భావోద్వేగంతో స్పందించాడు. అతడు ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి. తర్వాతి మ్యాచ్ల్లో స్టేడియాలు నిండిపోయాయి. వాళ్లనేమీ నిరాశపరచని ఛెత్రి.. టోర్నీ ఆద్యంతం రాణించి జట్టుకు కప్పును అందించాడు. ఇప్పుడు ఛెత్రి రిటైర్మెంట్తో ఆటను అభిమానులకు చేరువ చేసే ఓ స్టార్ను భారత ఫుట్బాల్ కోల్పోయినట్లే. ఈ వెలితిని పూడ్చడం అంత తేలిక కాదు. దేశంలో ఫుట్బాల్ పురోగతి స్తంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఛెత్రి వచ్చేదెప్పుడో..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్