తుదిపోరుకు సాత్విక్‌ ద్వయం

థాయ్‌లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్‌-తాంగ్‌ కైయ్‌ వీయ్‌ (చైనీస్‌ తైపీ) జోడీని చిత్తు చేసింది.

Published : 19 May 2024 02:30 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్‌-తాంగ్‌ కైయ్‌ వీయ్‌ (చైనీస్‌ తైపీ) జోడీని చిత్తు చేసింది. తొలి గేమ్‌ ఆరంభంలోనే 3-0 ఆధిక్యంలో నిలిచిన సాత్విక్‌-చిరాగ్‌కు తర్వాత మింగ్‌-వీయ్‌ల నుంచి పోటీ ఎదురైంది. అయినా కూడా 11-7తో విరామానికి వెళ్లిన భారత జంట.. బ్రేక్‌ తర్వాతా జోరు ప్రదర్శించింది. స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో భారత జంటకు ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో 6-6తో స్కోరు సమం చేసిన మింగ్‌-వీయ్‌.. 9-7తో ఆధిక్యంలోకి కూడా వెళ్లారు. కానీ అక్కడ నుంచి పుంజుకున్న సాత్విక్‌-చిరాగ్‌ ఇంకా పట్టువదల్లేదు. 15-10తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక.. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట ఓడిపోయింది. సెమీస్‌లో అశ్విని ద్వయం  12-20, 20-22తో జాంగ్‌కోల్‌పాన్‌-రవీందా (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో పేలవంగా ఆడిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పోరాడినా ఫలితం లేకపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని