Virender Sehwag: చివరి నిమిషంలో ఛాన్స్‌ పోయింది..: అరంగేట్రంపై సెహ్వాగ్‌

టీమ్‌ ఇండియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ 1998లోనే జాతీయ జట్టుకు ఆడాల్సింది. కానీ, చివరి నిమిషంలో అతడికి అవకాశం దూరమైంది. ఈ విషయాన్ని సెహ్వాగ్‌ ఇటీవల  వెల్లడించాడు.

Updated : 05 Jun 2023 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత క్రికెట్‌కు డ్యాషింగ్‌ ఓపెనింగ్‌ను పరిచయం చేసిన ఘనత వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag)కే దక్కుతుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే సీమర్ల బంతులను కూడా రెప్పపాటు కాలంలో బౌండరీ లైను దాటించేవాడు. అటువంటి సెహ్వాగ్‌కు.. క్రికెట్‌లో తొలిసారి అరంగేట్రం చివరి నిమిషంలో ఆగిపోయింది. కానీ, ఆ తర్వాత ఈ నజఫ్‌గఢ్‌ నవాబు కొన్ని నెలలకే టీమ్‌ ఇండియాలో స్థానం దక్కించుకొని దాదాపు దశబ్దానికి పైగా అభిమానులను అలరించాడు. ఇటీవల తన తొలిసారి అరంగేట్రం ఎలా ఆగిపోయిందో వెల్లడించాడు సెహ్వాగ్‌.

‘‘1998లో భారత్‌ షార్జాకప్‌ ఆడుతున్న సమయంలో ఆరుగురు ఆటగాళ్లు అనారోగ్యం పాలయ్యారు. దీంతో మర్నాడే విమానం ఎక్కి షార్జాలోని భారత జట్టుతో చేరమని బీసీసీఐ పెద్దల నుంచి నాకు కాల్‌ వచ్చింది. నేను టికెట్‌ తీసుకొని.. సామాను సర్దుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మరికొద్ది సేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. అప్పుడు నా పరిస్థితి ఓ పిల్లాడు తొలిసారి ఆడటానికి సిద్ధమైనట్లు ఉంది. అదే సమయంలో బీసీసీఐ ట్రేడ్‌ వింగ్‌కు చెందిన అజయ్‌ దుగ్గల్‌ నుంచి కాల్‌ వచ్చింది. షార్జాలోని కొందరు ఆటగాళ్లు కోలుకొన్నారని.. విమానం ఎక్కవద్దని చెప్పారు. వెంటనే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను’’ అంటూ వీరు తన అనుభవాన్ని వెల్లడించాడు.

1992లో సచిన్‌ ఆట తీరుతో అతడిని ఆరాధించడం మొదలుపెట్టినట్లు సెహ్వాగ్‌ వెల్లడించాడు. అప్పట్లో తాను సచిన్‌ను అనుకరిస్తే.. తన సోదరుడు వెక్కిరించేవాడని గుర్తు చేసుకొన్నాడు. ‘‘సచిన్‌ను ఆభిమానించే నాటికి నేను కూడా క్రికెట్‌ ఆడతానని అనుకోలేదు. 1992 వరల్డ్‌కప్‌ నుంచి నేను క్రికెట్‌ చూడటం మొదలుపెట్టాను. తెల్లవారుజామున 5 గంటల నుంచే లైవ్‌లో మ్యాచ్‌లు చూసేవాడిని. మా అన్నకు కూడా క్రికెట్‌ ఆడటం, చూడటం చాలా ఇష్టం. అప్పట్లో మాకు కేబుల్‌ టీవీ లేదు. దీంతో పొరుగింటికి వెళ్లి మ్యాచ్‌లు చూసేవాళ్లం’’ అని వీరు తన చిన్ననాటి అనుభవాలను పంచుకొన్నాడు. ఇక సెహ్వాగ్‌ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని