#CSKThings: బాటమ్‌ 9 to ఫైనల్‌... చెన్నై ఈసారి ఏం మాయ చేసింది?

2022 ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచి నిరాశపరిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Super Kings) ఈసారి ఫైనల్‌కి చేరింది. గత సీజన్‌ (IPL 2023)కు ఈసారి టీమ్‌లో ఏం మార్పులొచ్చాయి. మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) ఏం చేశాడు? అవి ఎంతవరకు జట్టు విజయానికి కారణం?

Updated : 24 May 2023 15:55 IST

పడిపోవడం తప్పు కాదు.. పడి లేవకపోవడం తప్పు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ (Chennai Super Kings)ను చూస్తే తెలుస్తుంది. గతేడాది పాయింట్ల టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచిన చెన్నై... ఈసారి (IPL 2023) అద్భుతంగా పుంజుకుని ఫైనల్‌కి చేరింది. మరి దీని కోసం చెన్నై ఏం చేసింది? మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) తన టీమ్‌లో ఎలా స్ఫూర్తి నింపాడో చూద్దాం!

  1. చెన్నై విజయానికి కారణాలు అని లిస్ట్‌ రాయడం మొదలుపెడితే.. ధోనీ పేరు తొలుత వస్తుంది. ఆ తర్వాత వచ్చేది.. ఓపెనింగ్‌ జోడీ. డేవాన్‌ కాన్వే (625), రుతురాజ్‌ గైక్వాడ్‌ (564) కలసి ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో తొలి వికెట్‌కు 1189 పరుగులు చేశారు. అందుకే వీరిద్దరూ ఆరెంజ్‌ క్యాప్‌ టాప్‌ 10 లిస్ట్‌లో ఉన్నారు. జట్టుకు పవర్‌ ప్లేలో భలే ఆరంభాన్నిచ్చారు ఈఇద్దరూ.
  2. ఏ జట్టుకైనా సొంత మైదానం అతి పెద్ద బలం.  చెన్నై ఈ ఏడాది జైత్ర యాత్ర చేయడానికి చెపాక్‌ స్టేడియమూ ఓ కారణం అని చెప్పాలి. ఇక్కడ ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే ఐదింట్లో గెలుపొందారు. ఇవి పాయింట్ల పట్టికలో చెన్నై టాప్‌ 2కి రావడానికి చాలా సాయపడ్డాయి. అయితే ధోనీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు వచ్చేసి సొంత మైదానాన్ని తలపించారు అనుకోండి. కానీ చెపాక్‌ ఎప్పటికీ చెన్నై టీమ్‌కి స్పెషలే.
  3. కెప్టెన్‌ కూల్‌.. మహేంద్ర సింగ్‌ ధోనీకి అభిమానులు పెట్టుకున్న పేరు ఇది. గతేడాది రవీంద్ర జడేజా, ధోనీ జట్టును నడిపించారు. దీంతో మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది. ఈ ఏడాది మాత్రం తన ట్రేడ్‌ మార్క్‌ కెప్టెన్సీతో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. కీలక సమయాల్లో ధోనీ నాయకత్వం ఈ సీజన్‌లో చాలా ఉపయోగపడింది. అదే ఇప్పుడు ఫైనల్‌కి తీసుకెళ్లింది.
  4. శిలను ఇస్తే శిల్పాలు చేసి ఇచ్చేవారిని శిల్పులు అంటారు. ఐపీఎల్‌లో అలాంటి ఓ శిల్పి ధోనీ అనొచ్చు. పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను తీసుకొచ్చి వాళ్లను పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలిపాడు. తుషార్‌ దేశ్‌పాండే (21) టాప్‌ వికెట్‌ టేకర్‌ లిస్ట్‌లో నాలుగులో ఉన్నాడంటే అదే కారణం. ఇక ధోనీ ఈ ఏడాది ఆయుధంగా వాడుతున్నది మతీశా పతిరనను. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్‌.. కీలక సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లు మలుపుతిప్పాడు. ధోనీ చెప్పినట్లు బంతి వేస్తే చాలు.. ఆటోమేటిగ్గా వికెట్లు వస్తాయి అనేది మరోసారి వాళ్లు చేసి చూపించారు. 
  5. మైదానంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. కామ్‌గా ఉంటాడు ధోనీ. అలా ఉండటం కాదు ఈ ఏడాది తన టీమ్‌కి కూల్‌గా ఎలా ఉండాలో నేర్పించాడు కూడా. క్వాలిఫయర్‌ 1లో చూస్తే.. ఇలాంటి ఓ సీన్‌ చూడొచ్చు. ఫీల్డింగ్‌లో సేనాపతి తత్తరపాటుకు గురవుతుంటే.. కూల్‌గా ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత అంతే కూల్‌గా అతను దర్శన్‌ నల్కాండేను రనౌట్‌ చేశాడు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి సంఘటనలు ఈ సిరీస్‌లో చాలా ఉన్నాయి. 
  6. జట్టు మీద నమ్మకం ఉంచాలి. జట్టుకు నమ్మకం ఇవ్వాలి. ఇదీ ధోనీ నమ్మే సిద్ధాంతం. ఒక్క మ్యాచ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకపోతే పక్కన పెట్టేయడం లాంటివి ధోనీకి, చెన్నైకి తెలియవు.  ఈ సీజన్‌లో ధోనీ మరోసారి అది చేసి చూపించాడు. ధోనీ తన టీమ్‌లో పెద్దగా మార్పులు చేయకుండా ఆటతీరులో మార్పులు చేయించి విజయాలు సాధించాడు. మొయిన్‌ అలీ, అంబటి రాయుడు లాంటివాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా.. ధోనీ వాళ్లకు మద్దతుగా నిలిచాడు. అందుకే క్వాలిఫయర్‌ 1లో కీలక సమయంలో వేగంగా ఆడి వాళ్లు రన్స్‌ అందించారు. 
  7. ధోనీలో ఓ పెద్దన్న ఉంటాడు అంటుంటారు సహచరులు. తప్పు చేస్తే నొప్పించకుండా జాగ్రత్త చెబుతూ ఉంటాడు. ఈ సిరీస్‌ ప్రారంభంలో వైడ్స్‌, ఫీల్డింగ్‌ మిస్టేక్‌ల గురించి ధోనీ కాస్త కఠువుగానే చెప్పాడు. ‘‘మీరు ఇలా కొనసాగిస్తే.. వేరే కెప్టెన్‌ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది’’ అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ మాటలు టీమ్‌లో చాలా మార్పే తీసుకొచ్చాయి. అవే విజయాన్ని కూడా తెచ్చాయి అని చెప్పాలి. 
  8. ధోనీ కెప్టెన్సీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫీల్డింగ్‌ గురించే. తాను కీపింగ్‌లో ఎంత అలర్ట్‌గా ఉంటాడో.. టీమ్‌ మొత్తం అలానే ఉండాలి అంటుంటాడు. ఒక్కోసారి ఫీల్డర్‌ను రెండు అడుగులు అటు, మూడు అడుగులు ఇటు అని మారుస్తుంటాడు. ఆ మార్పులు చక్కటి ఫలితాలు ఇస్తాయి. రీసెంట్‌గా జరిగిన గుజరాత్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి మార్పులే వికెట్లు తీశాయి. అయితే ఇలా మార్చి తాను విసిగించే కెప్టెన్‌ అవుతున్నా అంటూ తనను తాను సరదాగా విమర్శించుకున్నాడు ధోనీ. 
  9. ధోనీ టీమ్‌ను చూస్తే.. ఓ ఊహించని ప్లేయర్‌ ఉంటాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అని ఇప్పుడు ఐపీఎల్‌ తెచ్చింది కానీ.. ధోనీ ఎప్పుడో చేశాడు. ‘ఈ ప్లేయరా? కష్టమే ఆట’ అనుకునేవారిని జట్టులోకి తెచ్చి వాళ్లతో మెరుపు బ్యాటింగ్‌ చేయిస్తాడు. గతంలో రాబిన్‌ ఉతప్ప, అంబటి రాయుడు లాంటి వాళ్లను ఇలానే తీసుకొచ్చి మంచి ఫలితం సాధించిన ధోనీ.. ఈసారి అజింక్య రహానెను తెచ్చాడు. టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడ్డ రహానె.. మెరుపు అర్ధశతకంలో అన్ని జట్లకూ షాక్‌ ఇచ్చాడు. 
  10. జట్టుకు బలం అభిమానులు.. అలాంటివారికి గౌరవం ఇస్తే ఆ బలం ఇంకాస్త పెరుగుతుంది. ఈ విషయాన్ని ధోనీ, చెన్నై ఫ్రాంచైజీ బాగా నమ్ముతుంది. అలాగే మైదానంలో ఉన్న అభిమానుల ఆశను కూడా అర్థం చేసుకోవాలి. అందుకే రెండు భారీ షాట్లు కొట్టి తన కోసం వచ్చిన వాళ్లకు ఆనందాన్ని ఇవ్వడానికి ధోనీ ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ దిగడానికి ప్రయత్నించాడు. వచ్చి భారీ సిక్స్‌లు కూడా కొట్టాడు. ఇక లీగ్‌లో ఆఖరి మ్యాచ్‌ తర్వాత అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ పరేడ్‌ కూడా చేశాడు. ఇదంతా అభిమానులను గౌరవించడమే. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని