IND vs AUS: 2 - 0, 3 - 0, 3 - 1, 4 - 0... భారత్‌ ఎలా గెలిస్తే ఏమవుతుంది..?

భారత్ - ఆస్ట్రేలియా (Ind vs Aus) టెస్టు సిరీస్‌ను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ఇండియా (Team India).. ఈ సిరీస్‌ను గెలిస్తే రెండు ఘనతలను సొంతం చేసుకొనేందుకు వీలుంది.

Updated : 20 Feb 2023 13:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్‌.. రెండు మెట్లు ఎక్కేందుకు భారత్‌కు (team india) సువర్ణవకాశం. అందులో ఒకటి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లేందుకు ఛాన్స్‌.. మరొకటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లేందుకు మార్గం. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌.. మిగతా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తే రెండు ఘనతలు ఖాతాలో పడతాయో తెలుసుకొందాం.. 

మిగతా రెండింట్లో..

బోర్డర్ - గావస్కర్‌ టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ రేసులో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా రెండు టెస్టులను ఓడిపోవడం వల్ల 66.67 శాతానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ విజయాల శాతం 64.06 శాతానికి చేరింది. దీంతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మాత్రం జరగదు. మిగతా రెండు మ్యాచ్‌లను డ్రా చేసినా చాలు భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌పై రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ కనీసం 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకొంటే ఇతర జట్ల మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఫైనల్‌కు చేరుకున్నట్టే. ప్రస్తుతం 66.67 శాతంతో ఉన్న ఆసీస్‌ సిరీస్‌ కోల్పోయినప్పటికీ కనీసం ఒక్క టెస్టు గెలిచినా.. భారత్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడుగు పెడుతుంది.

ఎలా గెలిస్తే ఏమవుతుంది?

  • నాలుగు టెస్టుల తర్వాత 2 - 0తో భారత్‌ గెలిస్తే.. ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తాం.
  • 3 - 0తో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరతాం.
  • 3 - 1తో సిరీస్‌ను గెలిచినా ఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. 
  • 4 - 0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత్‌ డబ్ల్యూటీసీలో తొలి ఫైనలిస్ట్‌గా మారుతుంది. 

అప్పుడు ఆసీస్‌ అవకాశాలు న్యూజిలాండ్ - శ్రీలంక సిరీస్‌పై ఆధారపడి ఉంటుంది.

మూడు ఫార్మాట్లలోనూ ..

ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్‌దే అగ్రస్థానం. వరుసగా వన్డేలు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకొని మరీ టాప్‌ ర్యాంక్‌కు చేరుకొంది. ఇప్పుడు టెస్టు ర్యాకింగ్స్‌పై టీమ్‌ఇండియా దృష్టిసారించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలన్నా.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌కు చేరుకోవాలన్నా ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీసే కీలకమనే విషయం తెలిసిందే. కనీసం 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకొంటే చాలు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ భారత్‌ అగ్రస్థానానికి చేరుకొనేందుకు వీలుఉంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆసీస్‌ 126 పాయింట్లతో తొలి ర్యాంక్‌లో ఉండగా.. భారత్‌ 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అంటే కేవలం 11 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలవడంతో దాదాపు అగ్రస్థానానికి టీమ్‌ఇండియా చేరువైంది. మరో రెండు రోజుల్లో ర్యాంకుల గణాంకాలను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనుంది. మూడో టెస్టును భారత్‌ గెలిస్తే అగ్రస్థానానికి చేరుతుంది. 4 - 0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే మాత్రం టాప్‌ ర్యాంక్‌ భారత్‌ సొంతమవుతుంది. ఆసీస్‌ ఇంకా కిందికి దిగిజారిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు