IND vs AUS: అప్పుడు ఫాలోఆన్‌ ఆడించి ప్రమాదంలో పడి.. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లివే..

భారత్‌, ఆసీస్‌ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్, ఆసీస్‌ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల ఫలితాలపై ఓ లుక్కేద్దాం..

Updated : 15 Feb 2023 19:09 IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా నాగ్‌పుర్‌లో జరిగిన తొలి టెస్టులో స్పిన్‌ మంత్రంతో ఆసీస్‌ను ఓడించింది టీమ్‌ఇండియా. రెండో టెస్టులోనూ ఇదే వ్యూహంతో మరోసారి ‘కంగారు’ పెట్టించాలని ఆశిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఈ మైదానం ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక్కడ చివరగా 2017 డిసెంబరులో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు టెస్టులు జరిగాయి. మరి ఏ టెస్టులో ఎవరు విజయం సాధించారో తెలుసుకుందాం. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌  విజయం

అరుణ్ జైట్లీ (గతంలో ఫిరోజ్‌ షా కోట్ల) మైదానంలో 1959లో భారత్, ఆసీస్‌ తొలిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కంగారు జట్టు ఇన్నింగ్స్‌ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌  135 పరుగులకు కుప్పకూలగా.. ఆసీస్‌ 468 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 206 రన్స్‌ చేసి చేతులేత్తేసింది. పంకజ్‌ రాయ్‌ (99) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.  

పదేళ్ల తర్వాత రెండో టెస్టు 

సరిగ్గా పదేళ్ల తర్వాత (1969, డిసెంబర్‌) ఈ స్టేడియంలో భారత్‌, ఆసీస్ రెండోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఇయాన్‌ చాపెల్ (138) శతకం బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 296 పరుగులు చేసి ఆలౌటైంది. అశోక్‌ మన్కడ్ (97) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీ (5/37), ఇరపల్లి ప్రస్నన్న (5/42 )  విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 107 పరుగులకే చాప చుట్టేసింది. అజిత్ వాడేకర్ (91) దంచికొట్టడంతో 181 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 80.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఫాలోఆన్‌ ఆడించి.. ప్రమాదంలో పడి..

1979 అక్టోబర్‌లో దిల్లీ వేదికగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాల్సింది. గుండప్ప విశ్వనాథ్ (131), సునీల్‌ గావస్కర్‌ (115) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కపిల్‌ దేవ్ (5/82)తోపాటు శివ్‌లాల్ యాదవ్‌ (2/56),  బాబ్జీ నరసింహారావు (2/46) బంతితో రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులను భారత్ ఫాలో ఆన్‌ ఆడించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పట్టుదలతో ఆడి 413 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఒకవేళ భారత్ ఫాలో ఆన్‌ ఆడించకపోతే ఫలితం మరోలా ఉండేది. 

మూడ్రోజులు వరుణుడిదే ఆట

దిల్లీ స్టేడియంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు 1986 సెప్టెంబరులో జరిగింది. దేశ రాజధానిలో భారీ వర్షాలు కురవడంతో మ్యాచ్‌లో తొలి మూడు రోజుల్లో ఆట సాగలేదు. ఎట్టకేలకు నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆసీస్.. ఐదో రోజు (207/3) వద్ద డిక్లేర్డ్ చేసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

ఇటు మోంగియా.. అటు కుంబ్లే 

దేశ రాజధానిలో కంగారు జట్టుతో 1996 అక్టోబర్‌లో ఐదో మ్యాచ్‌ ఆడింది భారత్‌. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో కంగారులు 182 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం నయన్ మోంగియా (152; 366 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్‌) శతకానికి తోడు గంగూలీ (66) చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 361 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే (5/67), వెంకటేశ్ ప్రసాద్‌ (3/18) విజృంభించడంతో ఆసీస్‌ 234 పరుగులకు కుప్పకూలింది. 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

పరుగుల వరద.. గంభీర్‌, లక్ష్మణ్ డబుల్ 

అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆసీస్‌ మధ్య ఆరో టెస్టు మ్యాచ్‌ (2008 అక్టోబర్‌ 29- నవంబర్‌ 2) జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. గంభీర్ (206),  వీవీఎస్‌ లక్ష్మణ్‌ (200) డబుల్ మోత మోగించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 613/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 577 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 208/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

ఆఖరి మ్యాచ్‌ మనదే 

ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా చివరగా 2013 మార్చిలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అశ్విన్‌ (5/57)కు తోడు ప్రజ్ఞాన్‌ ఓజా, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 262 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 272 రన్స్‌కు ఆలౌటైంది. నాథన్‌ లైయన్‌ ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌.. 164 పరుగులకు కుప్పకూలింది. 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.

                      - ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు