IND vs BAN: వరుస బంతుల్లో ఫ్రీ హిట్‌లు.. అరుదుగా ఒకేలా ‘నో బాల్స్’

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో భారత్‌ ఓడినప్పటికీ కెప్టెన్‌ రోహిత్ శర్మ పోరాటం మాత్రం మరువలేనిది. ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన సంఘటన చోటు చేసుకొంది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్‌ ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో ఒకే విధంగా నో బాల్స్ వేయడం గమనార్హం.

Published : 09 Dec 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయింది. అయితేనేం ఆశలు లేని సమయంలో క్రికెట్ అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టేలా చేశాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. 

సెంచరీతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించిన మెహిదీ హసన్ మిరాజ్‌ బౌలింగ్‌లోనూ రాణించాడు. అయితే ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో వరుసగా రెండు బంతులను ‘నో బాల్‌’గా వేశాడు. ఇందులో వింతేముంది.. బౌలర్‌ ఇలా వేయడం సహజమేగా అని అనుకోకండి.. ఎందుకంటే రెండు నోబాల్స్‌ను ఒకేలా వేయడం గమనార్హం. బౌలింగ్‌ చేసే క్రమంలో మెహిదీ కాలు స్టంప్స్‌కి తాకడంతో  అంపైర్‌ ‘నో బాల్‌’గా ప్రకటించాడు. ఇలా వరుసగా రెండు బంతుల్లోనూ చోటు చేసుకోవడం విశేషం. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ బెస్ట్‌ నో బాల్‌ ఆఫ్ ది డే’ అంటూ కామెంట్లు కురిశాయి. 

అయితే మొదటిసారి వచ్చిన ఫ్రీ హిట్‌ను అక్షర్‌ పటేల్ సింగిల్‌ మాత్రమే తీశాడు. ఇక రెండో ఫ్రీ హిట్‌ను శ్రేయస్‌ (82) బౌండరీ బాదాడు. చివరికి మెహిదీ బౌలింగ్‌లోనే  శ్రేయస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని