Team India: ప్రపంచకప్‌ ఆశలపై ‘గాయాలు’ నీళ్లు చల్లుతాయా?

పొట్టి ప్రపంచకప్‌ సమీపిస్తోన్న కొద్దీ భారత శిబిరంలో గాయాల బెడద ఎక్కువుతోంది. ఇప్పటికే బుమ్రా, జడేజా దూరం కాగా.. తాజాగా గాయం కారణంగా దీపక్ చాహర్‌ కూడా వైదొలగనుండటం టీమ్‌ఇండియా అభిమానులకు షాక్‌ తగిలింది.

Published : 13 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాకు వరుస గాయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా ఐసీసీ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న భారత్‌కు.. దీపక్ చాహర్ గాయంతో మూడో షాక్‌ తగిలిందని సమాచారం. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలిగారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శనపై గాయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళన మొదలైంది. 

ఇద్దరూ టాపర్లే..

రోహిత్‌, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ ఫామ్‌లోకి వచ్చేశారు.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైపోయాడు.. అని ఆనందంతో ఉన్న టీమ్‌ఇండియాకు తొలి ఎదురు దెబ్బ రవీంద్ర జడేజా రూపంలో తగిలింది. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా మోకాలి గాయం కారణంగా.. శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకోవడంతో మెగా టోర్నీకి జట్టును ప్రకటించకముందే వైదొలిగిన తొలి ఆటగాడిగా మారిపోయాడు.

చాలా రోజులపాటు ఆటకు దూరమై.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చిన స్పీడస్టర్‌ జస్ప్రీత్ బుమ్రా కూడా భారీ షాక్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వెన్ను నొప్పి వస్తోందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ మ్యాచ్‌తోపాటు టీ20, వన్డే సిరీస్‌లకూ దూరమయ్యాడు. సరే ఇంకా సమయం ఉంది కదా.. ఈ లోపు కోలుకొని మెగా టోర్నీకి అందుబాటులోకి వస్తాడని భావించిన సగటు భారత క్రికెట్‌ అభిమానికి షాకింగ్‌ నిర్ణయం వచ్చింది. ఆ సిరీస్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై బుమ్రా కూడా స్పందిస్తూ.. మెగా టోర్నీలో ఆడలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు.

‘‘జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆటగాళ్లకు గాయాలు సాకుగా మారాయి. అదే భారత టీ20 లీగులో మాత్రం అన్ని మ్యాచ్‌లను ఆడేస్తారు’’.. ఇదీ బుమ్రా వైదొలగడంపై అభిమానుల నుంచి వచ్చిన కౌంటర్.

ఏంటి నష్టం?

ఓ ముగ్గురు ఆటగాళ్లు లేకపోతేనే భారత్‌ టీ20 ప్రపంచకప్‌ నెగ్గలేదా..? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర ప్లేయర్లు ఆ స్థానాలను భర్తీ చేయలేరా..? అని ప్రశ్నలు వస్తున్నాయి. బుమ్రాకి బదులు షమీ, సిరాజ్‌ వంటి పేసర్లు భారత్‌కు ఉన్నారు. అలాగే రవీంద్ర జడేజా లేకపోయినా.. అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లూ భారత్‌ సొంతం. అయితే కీలక ఆటగాళ్లు గైర్హాజరైతే.. జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారు. ఉదాహరణకు ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా లేకపోవడం వల్ల.. డెత్‌ ఓవర్లలో టీమ్‌ఇండియా కాస్త బలహీనంగా మారింది. బుమ్రా స్థానంలో తుది జట్టులో షమీ/సిరాజ్‌.. ఎవరు ఉంటారో తెలియదు. షమీ అయితే డెత్‌ ఓవర్లను చాలా బాగా హ్యాండిల్‌ చేయగలడని మాజీల విశ్లేషణ. కానీ బుమ్రా లేనిలోటు మాత్రం తీర్చలేనిదని స్పష్టం. ఎందుకంటే తనదైన యార్కర్లతో టాప్‌ బ్యాటర్లను సైతం వణికిస్తాడు. ఇప్పుడు బుమ్రా లేకపోవడంతో ప్రత్యర్థులు మన బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కోగలమనే భావిస్తారు. 

ఇంకెవరైనా ఉన్నారా..?

ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.. తర్వాత ఎవరు?. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌కు ముందు వరకు గాయాలతో సహవాసం చేసిన హార్దిక్‌ పాండ్య.. కోలుకొని అద్భుతంగా ఆడేస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక పేస్‌ ఆల్‌రౌండర్‌ అతడే. గాయాల పరంపర కొనసాగుతున్న వేళ.. పాండ్య మళ్లీ వెన్నునొప్పితో ఇబ్బంది పడితే మాత్రం టీమ్‌ఇండియాకు కష్టాలు రెట్టింపైనట్లే. బ్యాటింగ్‌లో ధాటిగా ఆడుతూ.. బౌలింగ్‌లో రాణించగల పేస్‌ ఆల్‌రౌండర్‌ మరొకరు లేరనే చెప్పాలి. ఇప్పుడు శార్దూల్‌ ఠాకూర్‌ను కూడా ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. అయితే  శార్దూల్ ఠాకూర్‌ ఉన్నప్పటికీ అతడి నుంచి హార్దిక్‌ స్థాయిలో ఆటను ఆశించడం అత్యాశే అవుతుంది. చాహల్ స్థానంలో ఎలాగూ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది. ఎవరైనా బ్యాటర్‌ కావాలంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ సిద్ధంగా ఉండనే ఉన్నాడు. వీరిద్దరూ స్టాండ్‌బై ఆటగాళ్లే. కానీ ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అదనంగా పేసర్‌తోపాటు బ్యాటర్‌ను ఎంచుకొంటేనే ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆందోళన అవసరం లేదు: మాజీలు

జడేజా, బుమ్రా, దీపక్.. దూరమైనప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఆయా ప్లేయర్లు లేకపోతే.. ఇతర ఆటగాళ్లకు అవకాశం వచ్చినట్లేనని.. చక్కగా వినియోగించుకొంటే వారే హీరోలవుతారని పేర్కొన్నారు. తమ టాలెంట్‌తో మంచి ప్రదర్శన చేస్తే అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేపోయే అవకాశం వచ్చిందని సూచనలు చేశారు. జడేజా స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్ తన ఆల్‌రౌండ్‌ టాలెంట్‌తో రాణిస్తే మాత్రం జట్టులో స్థానం సుస్థిరం చేసుకొనే అవకాశం ఉంది. అయితే రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టేస్తాడు.

‘‘తనకు వచ్చిన అవకాశాన్ని అక్షర్‌ రెండు చేతులా ఉపయోగించుకున్నాడు. భారత క్రికెట్‌లోనే ఇలా జరుగుతుంది. రవీంద్ర జడేజాను మనం మిస్‌ అవుతామన్నది నిజమే.. అయితే, అతడి స్థానంలో అక్షర్‌ ఎంపిక విలువైనదే. ముఖ్యంగా అతడు బంతితో ఆకట్టుకుంటున్న విధానం బాగుంది. బ్యాటింగ్‌ కూడా చేస్తాడు కాబట్టి.. అతడు ఇక్కడ సరిపోతాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిస్తే తిరుగుండదు’’.. - అక్షర్‌ పటేల్‌ గురించి మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా 

‘‘బుమ్రా లేకపోవడంపై భారత్‌ చింతించాల్సిన అవసరం లేదు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మినహా ఈ సంవత్సరం అతడు ఆడింది చాలా తక్కువ మ్యాచ్‌లు. అయితే బుమ్రా లేని టీమ్‌ఇండియాను ప్రత్యర్థులు చూసే విధానం మరోలా ఉంటుందనేది కాదనలేని సత్యం. కానీ బుమ్రా స్థానంలో వచ్చే వారికి ఇదొక మంచి అవకాశం’’ అని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని