IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌.. ఆ ‘ఒక్కటే’ భారత్‌ లక్ష్యం!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న భారత్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉండాలంటే మిగతా మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ఈ క్రమంలో గురువారం శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడనుంది.

Updated : 02 Nov 2023 09:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లను ఓడించింది. బంగ్లా, అఫ్గాన్‌ వంటి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టీమ్‌లపైనా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు మరో మ్యాచ్‌కు భారత్ సన్నద్ధమైంది. అయితే, ఈ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేసి ప్రత్యర్థులకు షాక్‌ ఇవ్వగల సత్తా ఉంది. అదే శ్రీలంక టీమ్‌. గురువారం ముంబయి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఈ సందర్భంగా టీమ్‌ఇండియా లక్ష్యం ‘ఒక్కటే’ అయి ఉండాలి.

ఒకరికొకరు భరోసా..

ప్రస్తుతం భారత్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆడిన ఆరింట్లోనూ గెలిచింది. ఇంకా మూడు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఇతర జట్లతో పోలిస్తే టీమ్‌ఇండియాకే అద్భుత అవకాశం ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో భారత్‌ మినహా అన్ని టీమ్‌లూ కనీసం ఒక్కో ఓటమిని చవిచూశాయి. భారత్‌ మాత్రమే విజయాలతో కొనసాగుతోంది. ఇక మిగిలి మ్యాచుల్లోనూ గెలిస్తే నెంబర్‌వన్‌ స్థానంతో ‘టాపర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఎదుర్కొన్న అన్ని పరీక్షలను టీమ్‌ఇండియా గట్టెక్కేసింది. బ్యాటింగ్‌లో ఇబ్బంది పడినప్పుడు బౌలర్లు ‘మేమున్నాం’ అంటూ జట్టును గెలిపించారు. బౌలర్లు చేసిన శ్రమను వృథా చేయకుండా బ్యాటర్లూ మిగతా మ్యాచుల్లో విజయతీరాలకు చేర్చారు. షమీ, బుమ్రా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. బ్యాటింగ్‌లో రోహిత్, విరాట్, గిల్, కేఎల్, సూర్య మంచి ఫామ్‌లో ఉన్నారు. శ్రేయస్‌ ఫామ్‌ పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉంది. క్రీజ్‌లో కుదురుకోగలిగితే మంచి ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా అతడి సొంతం. 

టీమ్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా?

ఇంగ్లాండ్‌తో ఆడిన జట్టే శ్రీలంకతోనూ బరిలోకి దిగుతుందా..? ఈ మ్యాచ్‌కూ హార్దిక్‌ పాండ్య దూరంగా ఉంటాడు. ముంబయి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్నర్‌ను అదనంగా తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే అశ్విన్‌ నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు పేస్‌ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకుంటే అదనంగా బ్యాటర్‌ కూడా అందుబాటులో ఉన్నట్లవుతుంది. గత రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేకపోయిన సిరాజ్‌ను పక్కన పెట్టి అశ్విన్ లేదా..? శార్దూల్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

గత ఐదు మ్యాచుల్లోనూ మనదే ఆధిపత్యం

భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో మనదే ఆధిపత్యం. మొత్తం 167 వన్డేల్లో ఆడగా.. 98 మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. శ్రీలంక 57 వన్డేల్లో గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టైగా ముగిసింది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్‌ విజయం సాధించడం విశేషం. ఇందులో ఆసియా కప్‌ ఫైనల్‌లో కేవలం 50 పరుగులకే లంకను టీమ్‌ఇండియా కుప్పకూల్చింది. సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. మరోసారి సిరాజ్‌ మియా నుంచి అలాంటి ప్రదర్శన రావాలి. అంతకుముందు ఆసియా కప్‌ సూపర్‌ -4 మ్యాచ్‌లోనూ శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు వరల్డ్‌ కప్‌లో పాథుమ్‌ నిస్సంక, కుశాల్ మెండిస్‌, సదీరా సమరవిక్రమ మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు. మధుశంక, వెల్లలాగే, కసున్‌ రజిత, తీక్షణతో తస్మాత్ జాగ్రత్త. వీరందరికీ ఉపఖండ పిచ్‌లు బాగా అలవాటు. ఏమరుపాటుగా ఉంటే షాక్‌ తగిలే ప్రమాదం లేకపోలేదు. వన్డే ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఇరు జట్లూ 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మెగా టోర్నీల్లో శ్రీలంక తమ శక్తియుక్తులన్నింటితో పోరాడుతుందనేదానికి ఇదొక ఉదాహరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని